సొంత గూటికి జిన్నారెడ్డి దంపతులు.. రేవంత్ సమక్షంలో చేరిక

by  |
Jinnareddy Padmaja, Venkateswarlu
X

దిశ, మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ సీనియర్ నాయకులు జిన్నారెడ్డి పద్మజావెంకటేశ్వర్లు సొంత గూటికి చేశారు. శుక్రవారం హన్మకొండలో టీపీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జిన్నారెడ్డి దంపతులు మాట్లాడుతూ.. మొన్నటి వరకు అంతా ఒకటే ట్రెండ్ ఉండేదని, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపే పరుగులు పెట్టడం జరిగేదని, కానీ దానికి భిన్నంగా మానుకోటలో మొదలైందని అన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు మానుకోటలో ప్రారంభం అయ్యాయని అన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్‌ పార్టీలు రెండూ ఒకటేనని అన్నారు.

బీజేపీ, టీఆర్ఎస్‌ పాలనలు భరించలేకనే కాంగ్రెస్‌లో చేరినట్టు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనే రాబోతోందని జోస్యం చెప్పారు. ఇంకా చాలామంది మా బాటలోనే రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నవారిలో మల్యాల మాజీ సర్పంచ్ వేల్పుల వెంకన్న, మాజీ ఎంపీటీసీ చిమ్నా నాయక్, శనగపురం మాజీ సర్పంచ్ రామరాజు, భిక్షపతి, రామిశెట్టి వీరేందర్, బీజేపీ టౌన్ సెక్రెటరీ విష్ణు, ఉప్పలయ్య, నీలం కృష్ణ, ఐలయ్య, అంజి బాబు, బాలాజీలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బెల్లయ్య నాయక్, వేంనరేందర్ రెడ్డి, భరత్ చంద్రారెడ్డి, నూనావత్ రాధా, డా.మురళీనాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story