దీపావళికి పెరగనున్న బంగారం అమ్మకాలు ?

by  |
దీపావళికి పెరగనున్న బంగారం అమ్మకాలు ?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఆభరణాల మార్కెట్ రికవరీ మార్గంలో ఉన్నందున ఈ ఏడాది పండుగ సీజన్‌లో బంగారం అమ్మకాలు బలంగా ఉంటాయని ఆభరణాల తయారీదారులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్ పరిస్థితులు సానుకూలంగా ఉండటం, గతేడాదితో పోలిస్తే బంగారం ధరలు తక్కువగా ఉండటంతో ఈసారి ధంతేరాస్ కళకళలాడనున్నట్టు తయారీదారులు అంచనా వేస్తున్నారు. 2020 కంటే దాదాపు 5 శాతం తక్కువగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000 వేల దిగువన ఉంది. అంతేకాకుండా వివాహ ముహుర్తాలు ఎక్కువగా ఉండటం ఈసారి కలిసి రానుంది.

ఈ నేపథ్యంలో దీపావళికి పసిడి అమ్మకాలు 2019 నాటి కరోనా ముందుస్థాయికి చేరుకోగలవని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ‘ఇటీవల దసరా పండుగ సమయంలో బంగారం అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. ఇది ధంతేరాస్‌లో కూడా కొనసాగనుంది. ఈ ఏడాది కరోనా నియంత్రణలో ఉండటం, ధరలు క్షీణించడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో అక్టోబర్-నవంబర్ నెలల్లో మొత్తం ఏడాది అమ్మకాల్లో 40 శాతం సాధిస్తాయని’ ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ ఆశిష్ అన్నారు. రత్నాలు, ఆభరణాల పరిశ్రమ ఇప్పటికే కరోనా ముందుస్థాయి నాటికి అమ్మకాలు చేరుకుంటాయని అంచనా వేస్తోంది. అయితే, బంగారం ధరలు 2019 నాటి స్థాయి కంటే 20 శాతం అధికంగా ఉండటం గమనార్హం. అలాగే, మారిన పరిస్థితుల్లో బంగారం అమ్మకాలు 5 శాతం ఆన్‌లైన్‌లో జరగనున్నాయని ఆశిష్ వెల్లడించారు.



Next Story

Most Viewed