రేపు జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్ష

by  |
రేపు జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్స్ 2021‌ రెండో విడత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈనెల18 వరకు మూడు రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. రెండో విడత పరీక్షలకు 5 లక్షల మంది వరకు విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌ను 2021 నుంచి నాలుగు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో నాలుగు రోజుల చొప్పున మేలో ఐదు రోజుల పాటు ఈ పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో ఎన్‌టీఏ నిర్వహించనుంది. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు తొలి విడత పరీక్షలను నిర్వహించారు. ఆ సెషన్‌కు 6.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మార్చి సెషన్‌ను 15 నుంచి 18 వరకు నిర్వహించేందుకు తొలుత షెడ్యూల్‌ ఇచ్చారు. రెండో విడత పరీక్షలకు రిజిస్టర్‌ అయిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మార్చి సెషన్‌ పరీక్షలను మూడు రోజులకు కుదించారు.16 నుంచి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

కరోనా జాగ్రత్తలు తప్పనిసరి

జేఈఈ మెయిన్స్‌ పరీక్షల నిర్వహణలో కొవిడ్‌-19 నియమాలను పాటించేలా ఎన్‌టీఏ చర్యలు చేపట్టింది. మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి 12 వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 7.30 నుంచి 8.30 గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. సిబ్బందితో పాటు పరీక్షలు రాసే వారంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. సిబ్బందికి గ్లౌజ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజేషన్‌ చేయిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే వారు తమతో పాటు పారదర్శక బాటిళ్లలో ఉండే శానిటైజర్‌ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. అలాగే పారదర్శక బాటిళ్లతో మంచినీరు, పారదర్శకంగా ఉండే బాల్‌పెన్నులను కూడా అభ్యర్థులు తెచ్చుకోవచ్చు. సెల్‌ఫోన్లు, డిజిటల్‌ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. అభ్యర్థి అడ్మిట్‌ కార్డుతోపాటు ఫొటో ఐడెంటిటీ కార్డును తెచ్చుకోవాలి. రఫ్ ‌వర్కు చేయడానికి అవసరమైన పత్రాలను పరీక్ష కేంద్రాల్లోనే ఇస్తారు. వాటిని తిరిగి పరీక్ష పత్రాలతోపాటు ఇన్విజిలేటర్లకు అప్పగించి రావాల్సి ఉంటుంది.

Next Story

Most Viewed