నల్గొండలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు

by  |
Janmabhoomi Express
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు నుంచి నల్గొండ మీదుగా వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇవాళ మధ్యాహ్నం 3గంటల నుంచి పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. నల్గొండ రైల్వే స్టేషన్‌ సమీపంలోని నార్కట్‌పల్లి వద్ద అండర్ పాస్‌ వంతెన పనులు జరుగుతుండడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల్లోగా అండర్‌ పాస్‌ పనులు పూర్తి చేస్తామని చెప్పిన రైల్వే అధికారులు.. ఆ మార్గంలో రోజువారీగా రాకపోకలు సాగించే రైళ్లకు అనుమతిచ్చారు. అనుకున్న సమయానికి అండర్‌పాస్‌ పనులు పూర్తి కాకపోవడంతో గుంటూరు నుంచి నల్గొండ మీదుగా వెళ్లాల్సిన రైళ్లు నల్గొండ, జిల్లాలోని ఇతర స్టేషన్లో నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో గుంటూరు నుంచి నల్గొండ మీదుగా సికింద్రాబాద్‌కు రావాల్సిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నల్గొండ రైల్వేస్టేషన్‌లోనే నిలిచిపోయింది. హైదరాబాద్‌ నుంచి కేరళలోని తిరువనంతపురం వెళ్లాల్సిన త్రివేండ్రమ్‌ ఎక్స్‌ప్రెస్‌ (శబరి ఎక్స్‌ప్రెస్‌) చిట్యాల స్టేషన్‌లో నిలిచిపోగా.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రామన్నపేటలో, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ స్టేషన్లలో నిలిచిపోయాయి. ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైళ్ల రాకపోవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంలో రైల్వే అధికారులు ఎలాంటి స్పష్టతనివ్వడం లేదు.

Next Story

Most Viewed