గ్రేటర్ బరినుంచి తప్పుకున్న జనసేన

by  |
గ్రేటర్ బరినుంచి తప్పుకున్న జనసేన
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల పొత్తు విషయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జనసేన నేత నాందెండ్ల మనోహర్ ఇంట్లో పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో లాగానే తెలంగాణలోనూ బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం అని తెలిపారు. కరోనా విస్తృతవ్యాప్తి మూలంగా అప్పట్లో కుదరలేదని వెల్లడించారు. హైదరాబాద్ విశ్వనగరంగా ప్రధాని మోడీ నాయకత్వంలోనే సాధ్యం అవుతుందని అన్నారు. అంతేగాకుండా గ్రేటర్ ఎన్నికల బరినుంచి జనసేన తప్పుకున్నట్టు ప్రకటించారు.

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఒక్క ఓటు కూడా పోకుండా.. జన సైనికులు బీజేపీకి సహకరించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జనసైనికులు నిరాశపడొద్దని పవన్ సూచించారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి జనసేన మద్దతు ఇస్తుందని అన్నారు. తక్కువ సమయం ఉండటం, రెండు పార్టీల మధ్య గ్యాప్‌ కారణంగా తాము గ్రేటర్ బరినుంచి తప్పుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా నామినేషన్ వేసిన జనసేన నేతలు విత్ డ్రా చేసుకోవాలని సూచించారు.

Next Story

Most Viewed