జనసేన బీజేపీ ఉమ్మడి మ్యానిఫెస్టో ఓట్లు కురిపిస్తుందా?

by  |
జనసేన బీజేపీ ఉమ్మడి మ్యానిఫెస్టో ఓట్లు కురిపిస్తుందా?
X

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోలాహలం మొదలైంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీని వేడెక్కిస్తున్నాయి. గ్రామాలను గెలుచుకోవడం ద్వారా సత్తా చాటాలని మూడు ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ పేరిట హామీలు గుప్పించి ఓట్లు దండుకోవాలన్న ఆతృతలో ఉన్నాయి.

వైఎస్సార్సీపీ వలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు, పింఛను దారులను నమ్ముకుని ఎన్నికల బరిలో దిగుతోంది. ప్రధానంగా ఈ మూడు పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ లబ్ది పొందాలని ప్రయత్నిస్తోంది. అధికార పార్టీ వ్యూహాన్ని చిత్తు చేసేందుకు జనసేన, బీజేపీలు రంగంలోకి స్థానిక సమరంలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డాను జనసేనాని కలిశారు. వైఎస్సార్సీపీ, టీడీపీని అడ్డుకునేందుకు వ్యూహాలు రచించారు.

ఈ నెల 12న ఈ రెండు పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేయనున్నాయి. ఇందులో గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌కు వివిధ హామీలు ఇవ్వనున్నారు. జనసేనకు గ్రామస్థాయిలో కార్యకర్తలున్నారు. అయితే వారు ఎన్నికలను ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్నారా? అన్నది అనుమానమే.. ఇక బీజేపీ సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుంది. పట్టణాల్లో తప్ప గ్రామాల్లో ఆ పార్టీకి అంత ఆదరణ లేదు. ఈ నేపథ్యంలో వారి మ్యానిఫెస్టో ఎలా ఉండబోతోంది? ఏఏ అంశాలను స్పృశించనున్నారన్న ఆసక్తిరేకిత్తిస్తోంది.

మ్యానిఫెస్టోతో టీడీపీ కేడర్‌ను ఆకర్షిస్తే ఏపీలో ఈ రెండు పార్టీలు పాగావేయొచ్చన్న ఆశలో ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన కేడర్ పార్టీ మారాల్సిన అవసరం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ గల్లంతైంది. ఈ నేపథ్యంలో టీడీపీ క్యాడర్‌పై జనసేన, బీజేపీ పార్టీలు కన్నేశాయి. స్థానిక సమరంలో కేడర్‌ను బలోపేతం చేసుకుంటే భవిష్యత్‌కు ఢోకా ఉండదని ఆ పార్టీలు భావిస్తున్నాయి. మరి ఈ పార్టీ వ్యూహాన్ని టీడీపీ ఎలా అడ్డుకుంటుందో చూడాలి.



Next Story

Most Viewed