ఏదైన విల్లాకే మళ్లిస్తున్నాడు- జల్‌పల్లి మాజీ ఎంపీటీసీ ఆరోపణ

by  |
counciler
X

దిశ, జల్‌పల్లి : కౌన్సిలర్​ బుడుమల యాదగిరి జల్‌పల్లి మున్సిపాలిటీలోని 16వ వార్డు అభివృద్ది పనుల నిధులను ఆయన సొంత విల్లా కోసం దారి మళ్లిస్తున్నాడని జల్‌పల్లి మున్సిపాలిటీ సీనియర్​ టిఆర్‌ఎస్​ నాయకుడు, మాజీ ఎంపీటీసీ యంజాల జనార్థన్ ఆరోపించారు. ఎంతో నమ్మకం, విశ్వాసంతో కౌన్సిలర్‌గా గెలిపిస్తే 16వ వార్డు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. బుధవారం జల్‌పల్లి మున్సిపాలిటీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌన్సిలర్​ బుడమల యాదగిరిపై ఫైర్​ అయ్యారు.

ఈ సందర్భంగా యంజాల జనార్థన్​ మాట్లాడుతూ, 16వ వార్డు అభివృద్ది ధ్యేయంగా పెట్టుకుని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీ.సీ. రోడ్డు, డ్రైనేజీ పనుల కోసం 10 లక్షలు కేటాయిస్తే ఆ నిధులను తన సొంతానికి దారి మళ్లించాడని ఆరోపించారు. గత వర్షాకాలంలో రోడ్లన్నీ నీటితో మునిగి పోతే తాళ్లకుంట నుంచి నాసిరకం మట్టిని తీసుకువచ్చి పూడ్చి బుడుమల జల్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయం నుంచి 3.50 లక్షల రూపాయలను సొమ్ము చేసుకున్నాడన్నారు. గత వర్షాకాలంలో ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించిన వరద బాధితుల సహాయాన్ని కూడా పక్కదోవ పట్టించాడని ఆరోపించారు.

దళిత కార్డులను అడ్డం పెట్టి జల్‌పల్లి మున్సిపాలిటీ అధికారులను వేధిస్తున్నారన్నారు. సబితా ఇంద్రారెడ్డిపై ఇక అవాకులు చెవాకులు పేలిస్తే తాట తీస్తామన్నారు. 16వ వార్డు ప్రజలను మోసం చేయాలని చూస్తే విల్లా ముందు బైఠాయిస్తామని కౌన్సిలర్‌ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దూడల శ్రీనివాస్​గౌడ్, టీఆర్‌ఎస్​ నాయకులు గోపాల్‌ రెడ్డి, నాగేష్, వాసుబాబు, సత్తిరెడ్డి, అనుజ్‌గౌడ్​, అబ్బాస్​ తదితరులు పాల్గొన్నారు.


Next Story