ఏపీలో కరోనా నివారణకు రూ. వెయ్యి కోట్లు

by  |
ఏపీలో కరోనా నివారణకు రూ. వెయ్యి కోట్లు
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో సుమారు 8 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్యఆరోగ్య శాఖాధికారుల్లో ఆందోళన నెలకొంది. అయితే సంజీవని బస్సుల్లో కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండంతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. భారీ కేసుల నమోదైన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 54 ఆస్పత్రులను కరోనా చికిత్స కోసం అదనంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో ఏపీలో మొత్తం 138 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు క్రిటికల్‌ కేర్‌ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. వీటిలో మూడు ఆస్పత్రులు ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. మిగిలిన రెండు ఆస్పత్రులను తొందర్లోనే కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు అందుబాటులోకి తెస్తామని సీఎం స్పష్టం చేశారు.

దీంతో ఏపీలో కరోనా వైరస్ బాధితుల చికిత్స నిమిత్తం అదనంగా 2380 క్రిటికల్‌ కేర్‌ బెడ్లు అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు. కరోనా వైరస్ నివారణకు రానున్న 6 నెలల్లో మరో 1000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ఈ మొత్తాన్ని కరోనా నివారణ మందులు, కరోనా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం ఖర్చు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు, క్వారంటైన్‌ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు వెచ్చిస్తామని అన్నారు. వీటి కోసం ఇప్పటికే రోజుకు సుమారు 6.5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆయన వెల్లడించారు.

Next Story

Most Viewed