పవన్ కు పిలుపు.. జగన్ సమీక్ష

by  |
పవన్ కు పిలుపు.. జగన్ సమీక్ష
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. ఈనెల 2,3,4 తేదీల్లో రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిని జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రంలోని జనసేన నేతలు రోడ్ల పరిస్థితిని షోషల్ మీడియాలో షేర్ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రోడ్ల పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే రోడ్లు బాగు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయని..వెను వెంటనే రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని సూచించారు. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నీ బాగు చేయాలన్నారు. వర్షాల వల్ల రహదారులు బాగా దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. రోడ్లు బాగు చేసేందుకు ప్రభుత్వం నిధి ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ సమీక్షలో వెల్లడించారు. రోడ్ల మరమ్మతుల కోసం ఇప్పటికే చాలావరకు టెండర్లు పిలిచారని.. ఎక్కడైనా ఇంకా పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా రోడ్ల పనులు చేయాలని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు, ఎల్లో మీడియాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తూ ఒక్క చంద్రబాబుతోనే కాదు పచ్చమీడియాతోనూ మనం యుద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు లేకపోవడంతో వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ప్రతి విషయంలో వక్రీకరణలు చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాకూడా..నెగెటివ్‌ ఉద్దేశంతో ప్రచారం చేసినా.. మనం చేయాల్సిన పనులు చేద్దాం. ఈ ప్రచారాన్ని పాజిటివ్‌గా తీసుకుని అడుగులు ముందుకేద్దాం. మనం బాగా పనిచేసి పనులన్నీ పూర్తిచేస్తే… నెగెటివ్‌ మీడియా ఎన్నిరాసినా ప్రజలు వాటిని గమనిస్తారు. మనం బాగు చేశాక ప్రజలు ప్రయాణించే రోడ్లే దీనికి సాక్ష్యాలుగా నిలబడతాయి.

న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు సహాయంతో రూ. 6,400 కోట్ల ఖర్చుతో కొత్తరోడ్లకు కార్యాచరణ చేపట్టబోతున్నట్లు తెలిపారు. మండల కేంద్రాలనుంచి జిల్లా కేంద్రాలకు రెండు లేన్లతో మంచి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలన్నారు. కొడికొండ చెక్‌పోస్టు మీదుగా విజయవాడ – బెంగళూరు రహదారిని ఫాస్ట్‌ట్రాక్‌లో చేపడుతున్నామని అధికారులు వివరించారు. విశాఖపట్నం సిటీ గుండా అనకాపల్లి నుంచి ఆనందపురం వెళ్లే రహదారిలో ప్రధానమైన జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టడానికి అన్నిరకాలుగా సిద్ధమయ్యామని అధికారులు సీఎం జగన్ తెలిపారు. నడికుడి – శ్రీకాళహస్తి, కడప– బెంగళూరు, కోటిపల్లి–నర్సాపూర్, రాయదుర్గ్‌ – తుంకూర్‌ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులను ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.


Next Story

Most Viewed