స్వీటిని చూస్తే గర్వంగా ఉంది : పూరీ జగన్నాథ్

by  |
స్వీటిని చూస్తే గర్వంగా ఉంది : పూరీ జగన్నాథ్
X

దిశ, వెబ్ డెస్క్: మంచి నటిగా గుర్తింపు పొందిన దక్షిణాది నటీమణుల్లో అనుష్క ఒకరు. సూపర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. అరుంధతితో స్టార్‌డమ్ సంపాదించుకుని బాహుబలితో దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సొంతం చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ చేసిన అనుష్క ఆ తర్వాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే చేస్తూ వచ్చారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ది బెస్ట్ చాయిస్‌గా నిలుస్తూ వస్తోంది స్వీటీ. ఆమె టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి జూలై 20కి 15 ఏండ్లు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే స్వీటిని తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్‌కు దక్కుతుంది. తాజాగా అనుష్కను చూస్తే గర్వంగా ఉందంటూ పూరీ ట్వీట్ చేశారు.

‘అనుష్కను చూడగానే చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని సూపర్ సినిమా రిలీజ్ రోజే నాగార్జున గారు చెప్పారు. సూపర్ నుంచి నిశ్శబ్దం వరకు ఎన్నో మెట్లు ఎక్కి ఈ స్థాయిలో ఉన్న అనుష్కని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. నిశ్శబ్దం సినిమాతో నువ్వు మరింత రాక్ చేస్తావని ఆశిస్తున్నాను’ అంటూ పూరి ట్విట్టర్‌ వేదికగా అనుష్కపై అభినందనల వర్షం కురిపించారు. అనుష్క శెట్టి 15 ఏండ్ల సినీ ప్ర‌స్థాన‌ వేడుకను ఇటీవలే ఘ‌నంగా సెలబ్రేట్ చేసిన విషయం తెలిసిందే.

‘భాగమతి’ తర్వాత అనుష్క శెట్టి.. ‘సైరా నరసింహారెడ్డి’లో ఝాన్సీ రాణి లక్ష్మీ బాయిగా కాసేపు కనిపించి అలరించారు. ఆ తర్వాత ఆమె చేసిన సినిమా ‘నిశ్శబ్దం’. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాలి. కానీ, లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతబడటంతో విడుదల తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే, ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, ‘నిశ్శబ్దం’ తరవాత అనుష్క చేయబోయే సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన ఏమీ లేదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ నిర్మాణంలో అనుష్క లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే దాని గురించి కూడా ఎటువంటి ప్రకటన రాలేదు. మరో గుడ్‌న్యూస్ ఏంటంటే.. కమల్ హాసన్ నటించిన రాఘవన్‌ సినిమాకు గౌతమ్ మీనన్ సీక్వెల్ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఆ సినిమా కోసం అనుష్కను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం అనుష్క అనౌన్స్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Next Story