పట్టాలు ఇవ్వాలని ఐటీడీఏ ముట్టడి

by  |
పట్టాలు ఇవ్వాలని ఐటీడీఏ ముట్టడి
X

దిశ, వాజేడు: ఆదివాసుల సాగులో ఉన్న భూములకు 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు దాడులు అక్రమ కేసులు ఆపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆదివాసి సంఘం ఆధ్వర్యంలో ఏటూరునాగారం ఐటిడిఏ ముట్టడి కార్యక్రమం గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో సుమారు 85 వేల ఎకరాలలో ఆదివాసులు సాగులో ఉన్నారని, ఆ భూములకు పట్టా హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఆదివాసులపై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు గురి చేస్తున్నారని, అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేసి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఫారెస్టు, రెవెన్యూ మధ్య ఉన్న 40 వేల ఎకరాలకు పరిష్కారం వెంటనే చూపించి గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని ఆయన అన్నారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ ఏపీవో వసంతరావుకు అందజేశారు. ఐటిడిఏ ముట్టడి కార్యక్రమాన్ని ఏటూరునాగారం సీఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గిరిజన నాయకులతో మాట్లాడి విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు డి. కృష్ణ, ములుగు జిల్లా సిపిఎం కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జ్ఞాన వాసు, వై సంఘం నాయకులు గఫార్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed