బ్రేకింగ్.. మావోయిస్టుల దాడిలో ఇద్దరు ఐటీబీపీ అధికారులు మృతి

by  |
బ్రేకింగ్.. మావోయిస్టుల దాడిలో ఇద్దరు ఐటీబీపీ అధికారులు మృతి
X

దిశ, భద్రాచలం టౌన్ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్ డివిజన్‌ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు శుక్రవారం భద్రతా బలగాలపై దాడి చేశారు. ఈ వ్యూహాత్మక దాడిలో ఐటీబీపీ 45వ బెటాలియన్ కమాండెంట్ సుధాకర్ షిండే (మహారాష్ట్ర), ఏఎస్ఐ గురుముఖ్ సింగ్ (పంజాబ్) మృతిచెందారు. బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ ఈ ఘటన ధృవీకరించారు.

ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా అందిన సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెళ్లి కూంబింగ్ నిర్వహిస్తున్న ఐటీబీపీ జవాన్లపై మావోయిస్టులు తొలుత మందుపాతర పేల్చి, వెనువెంటనే కాల్పులు జరిపినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దాడి చేసిన మావోయిస్టులు జవాన్ల వద్ద నుంచి ఒక ఏకె 47 ఆయుధం, రెండు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఒక వాకీ టాకీని దోచుకున్నట్లుగా తెలుస్తోంది. కడేమెట శిబిరానికి దాదాపు 600 మీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది.

దాడి సమాచారం తెలిసిన వెంటనే క్యాంపు నుంచి జవాన్లు అక్కడికి పెద్ద సంఖ్యలో వెళ్తుతుండగా అది గమనించిన మావోయిస్టులు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. జవాన్లు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. ఇదిలా ఉండగా గత జూలై 20న ఎమ్మెల్యే చందన కశ్యప్ పర్యటన నేపథ్యంలో రహదారిని క్లియర్ చేస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపిన ఘటనలో జవాన్ శివకుమార్ మీనా మరణించిన సంగతి ‘దిశ’ పాఠకులకు విదితమే. సరిగ్గా నెల రోజుల తర్వాత అదే జిల్లాలో మావోయిస్టులు మళ్లీ ఇలా దాడి చేయడం గమనార్హం.

Next Story