కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఈటల.. ఊరుకునేదే లేదంటూ ఫైర్

by  |
etala rajendar
X

దిశ, పాపన్నపేట: రైతులు పండించిన ధాన్యం కొనకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ వారి జీవితాలతో ఆడుకుంటే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ క్షేత్ర పరిసరాల ప్రాంతాల్లో ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పరిష్కరించలేక కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారని ఆయన ఎద్దేవా చేశారు. రైతుల శ్రేయస్సు కోసం పాటు పడుతున్నామని గొప్పలు చెప్పే సీఎం.. రైతులు వాన కాలంలో పండించిన పంటకు కొనుగోలు చేయమని చెప్పడం సబబేనా అని ప్రశ్నించారు. కోట్ల రూపాయల పెట్టి ప్రాజెక్టులను, చెక్ డ్యామ్‌లను కట్టి సాగు నీరు అందించి రైతులను వరి వేయకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మెుగ్గు చూపాలని అనడం విడ్డూరంగా ఉందన్నారు.

ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చినా రాష్ట్రం ఎప్పుడు బాగుపడదని పేర్కొన్నారు. కేంద్రం ఉప్పుడు బియ్యం కొనుగొలు చేయమని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం వారి మాటను పెడ చెవిన పెట్టిందన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటే ఊరుకునేది లేదని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు జనార్దన్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, గోపి నందు, జనార్దన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బి కొండ రాముడు, జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, కిష్టయ్య, సత్యనారాయణ, రమణ, సాయి కుమార్ పాల్గొన్నారు.


Next Story