సముద్రాన్ని అల్లకల్లోలంగా మార్చేసింది… కాసేపట్లో తీరం చేరనుంది

by  |
సముద్రాన్ని అల్లకల్లోలంగా మార్చేసింది… కాసేపట్లో తీరం చేరనుంది
X

దిశ, ఏపీ బ్యూరో: భారత వాతావరణ శాఖ సూపర్ సైక్లోన్‌‌గా అభివర్ణించిన ఎంఫాన్ తుపాను కాస్త శాంతించినట్లుగా కనిపిస్తోన్నది. సూపర్ సైక్లోన్ నుంచి తీవ్ర తుపానుకు మారింది. తీరం చేరేకొద్దీ తీవ్రత తగ్గించుకుంటోన్నది. తుపానులు తీరం చేరే క్రమంలో మరింత ప్రమాదకరంగా మారుతుంటాయి. ఎంఫాన్ మాత్రం సముద్రంలోనే తీవ్రతను కాస్త తగ్గించుకుంది. ఇది ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు, బంగ్లాదేశ్‌కు కూడా శుభపరిణామమేనని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

ఎంఫాన్ తుపాను తొలుత ఉత్తరాంధ్రపై ప్రభావం చూపే ప్రమాదముందని వాతావరణ శాఖలు అంచనావేశాయి. అయితే సముద్రంలో దాని దిశలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోకపోవడంతో ఒడిశా, బంగ్లాదేశ్‌పై ప్రభావం ఉంటుందని స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఏపీలోని పోర్టుల్లో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా, ఒడిశా, బెంగాల్‌లో ఐదవ నెంబర్ ప్రమాదహెచ్చరికలు జారీ అయ్యాయి.

తీరం వెంబడి 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రెండు రాష్ట్రాలకు వెళ్లాల్సిన శ్రామిక్ రైళ్లను రద్దు చేశారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. మరి కొన్ని గంటల్లో పశ్చిమ బెంగాల్ సుందర్బన్ అడవుల దగ్గర్లో దిఘా వద్ద ఎంఫాన్ తుపాను తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 200 కిలోమీటర్ల ప్రచండ వేగంతో ఉద్ధృతమైన గాలులు వీస్తున్నాయి.

చంద్‌బలీ, భువనేశ్వర్, బాలాసోర్‌తోపాటు పారదీప్‌లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటికి పెనుగాలి తోడై చెట్లను చుట్టేస్తోన్నది. ఏపీలో తీరం వెంబడి భారీ ఎత్తున పంటనష్టం చోటుచేసుకుంది. అరటి, బొప్పాయి, కొబ్బరి పంటలు నేలకూలాయి. ఉత్తరాంధ్రలోని తీరం వెంబడి ఉన్న మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సోంపేటలోని బారువ తీరంతో పాటు, ఉప్పాడ వంటి చోట్ల సముద్రం 300 అడుగుల ముందుకు దూసుకొచ్చింది. విశాఖపట్టణంతో పాటు శ్రీకాకుళం వరకు ఉన్న తీర ప్రాంతం చిగురుటాకులా వణికిపోతోన్నది. మూడు రాష్ట్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎప్ దళాలు సిద్ధంగా ఉన్నాయి.



Next Story