అధికార నాయకులు తుగ్లక్ పాలన వీడండి.. లేకపోతే సమస్యనే

by  |
అధికార నాయకులు తుగ్లక్ పాలన వీడండి.. లేకపోతే సమస్యనే
X

దిశ, ముధోల్ : అధికార నాయకులు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయొద్దని తుగ్లక్ పాలన వీడాలని బీజేపీ నాయకులు బోస్లె మోహన్ రావు పాటిల్ అన్నారు. బుధవారం భైంసా పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాతూ… ఇటీవల భైంసా పట్టణంలో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు ఎకరాల‌లో కట్టాల్సినటువంటి మార్కెట్‌ను కేవలం ముప్పై మూడు గుంటలు ఉన్న ప్రదేశంలో కట్టడం ఎంత వరకు సమంజసమని అన్నారు.

యావత్ తెలంగాణలో నిర్మించుతున్న ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లన్నీ రెండెకరాల స్థలంలలోనే నిర్మించుతన్నారు. కానీ, కేవలం బైంసా పట్టణంలో ఇలా ముప్పై మూడు గుంటలలో నిర్మించడం ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడమే, ఈ స్థలం‌లో అన్ని రకాల మార్కెట్ సముదాయాలు, పార్కింగ్ మైదానము సౌకర్యవంతంగా నిర్మించడానికి వీలుండదని అన్నారు. అలాగే పట్టణం‌లో దాదాపు రెండు కోట్లతో క్రీడా మైదానం నిర్మించబడి ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడం సిగ్గు చేటు అన్నారు. అంతే కాకుండా నిర్మించిన క్రీడామైదానం కాస్తా, గడ్డి మైదానాలు‌గా మారి నిరుపయోగంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పట్టణంలో నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ని ఆపి, పట్టణంలో రెండు ఎకరాల అనువైన స్థలాన్ని చూసి నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ పునరాలోచించాలని అన్నారు. ఇదే విషయామై నిన్న నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖికి వినతి పత్రం అందించడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై అశ్రద్ధ వహిస్తే బీజేపీ ఆధ్వర్యంలో సమస్యను మరింత ముందుకు తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.

Next Story