మొబైల్ మాట్లాడుతూ బండి నడపడం నేరం కాదు : నితిన్ గడ్కరీ

by  |
mobile talking
X

దిశ, తెలంగాణ బ్యూరో : బండి నడుపుతూ మొబైల్ మాట్లాడుతూ ఉంటే ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని స్పాట్ ఫైన్ వేయడం, చలాన్ రాయడం, కేసు పెట్టడం హైదరాబాద్ నగరంలో రోజువారీగా జరుగుతున్న వ్యవహారం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 2019 మోటారు వాహన (సవరణ) చట్టంలోని సెక్షన్ 184(సీ) ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొంటూ ఉంటారు. కానీ ఆ సెక్షన్ ప్రకారం బండి నడుపుతూ మొబైల్ వాడడం తప్పేమీ కాదని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

బండి నడుపుతున్నప్పుడు చేతిలో ఫోన్ పెట్టుకుని మాట్లాడడం లేదా చూడడం లాంటివి చేస్తేనే చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం నేరమవుతుందని వివరించారు. కానీ చేతులతో పట్టుకోకుండా మొబైల్‌ను వినియోగించడం నేరం కాదని క్లారిటీ ఇచ్చారు. అంటే బ్లూ టూత్‌తో పనిచేసే ఇయర్ ఫోన్‌లు లేదా కేబుల్‌తో పనిచేసే ఇయర్ ఫోన్‌లు వాడడం లేదా స్పీకర్‌ ఆన్ చేసి సంభాషిస్తూ బండి నడపడం నేరం కాదని వివరించారు.

కానీ దీన్ని సాకుగా తీసుకుని ఇయర్ ఫోన్‌లో పాటలు వింటూ, మాట్లాడుతూ బండి నడిపితే ఏకాగ్రత దెబ్బతిని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చట్టంలో ఏమున్నా, అది నేరమైనా కాకపోయినా వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ మొబైల్ డ్రైవింగ్‌ మంచిది కాదని ‘దిశ’ సూచిస్తున్నది. చట్టంలో ఏమున్నా వ్యక్తిగత భద్రతతో పాటు కుటుంబ క్షేమం కోసం మొబైల్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని కోరుతున్నది.

Next Story

Most Viewed