వారికి అడగ్గానే వెహికల్స్ ఇస్తే ఇబ్బందులే..

by  |
వారికి అడగ్గానే వెహికల్స్ ఇస్తే ఇబ్బందులే..
X

దిశ, కుత్బుల్లాపూర్: అన్నా కొంచె అర్జెంట్ పని పడింది.. చౌరస్తా వరకు వెళ్లొస్తా.. బండి ఇవ్వే అన్న. అని అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా బండి ఇస్తున్నారా.. అయితే ఇకపై మీ బండిపై ఆశలు వదులుకోవాల్సిందే.. అంతేకాదండోయ్.. మీ టైం బాలేకపోతే.. జైలుకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అందేంటి.. ఎందుకంటారా అవును మరి.. చట్టాలు అలాగే ఉన్నాయండీ బాబూ.. తెలిసినవాడే కదా.. డ్రైవింగ్ వచ్చులే అని తేలికగా తీసుకుంటాం. కానీ ఏమైనా ప్రమాదం జరిగినా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నా యజమాని చుక్కలు చూడాల్సిందే. ట్రాఫిక్ నిబంధనలు మనందరికీ తెలుసు. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాల్లో అసలుకే ఎసరొచ్చే ఓ చట్టముంది మీకు తెలుసా.. అదే వాహన చట్టం 181. అంతంతమాత్రమే తెలిసిన చట్టాలతో వచ్చే మాములు ఇబ్బందులు మాత్రమే చూశాం. కానీ ఈ చట్టం వల్ల కటకటాల పాలుకావాల్సిందే మరి.

ఇటీవల నమోదైన కేసులు..

వాహన చట్టం -181 ప్రకారం లైసెన్స్ లేకుండా నడిపితే కేసులు నమోదు చేస్తారు. ఈ చట్టం కింద గత యేడా ది బాలానగర్ జోన్ అల్వాల్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 600కిపైగా కేసులు నమోదయ్యాయి. ఈ చట్టం ప్రకా రం లైసెన్స్ లేని వారికి వాహనం ఇచ్చిన వారిపై చార్జ్ షీ ట్ నమోదు చేస్తారు. ఈ చట్టం ప్రకారం గత ఆరు నెలల కాలంలో అల్వాల్ పరిధిలో 10మంది వాహన యజమానులపై కేసులు నమోదయ్యాయి. ఇందులో కొందరు జైలు కూడా వెళ్లినట్లు సమాచారం.

మేడ్చల్ జిల్లా కిష్టాపూర్ గ్రామం వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన బొంది లక్ష్మణ్ కూలీలను తీసురావాలని మైనర్ అయిన తన కుమారుడికి కారిచ్చి పంపించాడు. అయితే మేడ్చల్ పట్టణ ఐటీఐ సమీపంలో కారును రాంగ్ రూట్ లో వెళ్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనదారుడిని ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మైనర్ తోపాటు వాహనమిచ్చిన తండ్రిని కోర్టుకు తరలించగా తండ్రికి జైలుశిక్ష విధించారు.

బేగంపేట పాటిగడ్డకు చెందిన తాజుద్దీన్ డీసీఎంను అద్దుకు తీసుకుని పాల వ్యాపారం చేస్తున్నాడు. అయితే గత నెల 21న డ్రైవింగ్ లైసెన్సు లేని యువకుడైన వినోద్ కుమార్ కు వాహనం ఇవ్వగా మేడ్చల్ నుంచి పాలను తీసుకుని నగరానికి వస్తున్నాడు. కొంపల్లి చౌరస్తా వద్దకు రాగానే సిగ్నల్ పడడంతో ఆగిన లారీని వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా అతడికి డ్రైవింగ్ లైసెన్సు లేదని గ్రహించారు. వాహనమిచ్చిన తాజుద్దీన్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

జాగ్రత్తలు పాటించాలి

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టాలను తప్పక పాటించాలి. ఏదైనా అత్యవసరమని వాహనం అడిగితే అతడికి డ్రైవింగ్ వచ్చా.. లేదా..? అనేది తెల్సుకోవడంతోపాటు లైసెన్సు వివరాలను తెలుసుకోవడం తప్పనిసరి. నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.

– రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ, అల్వాల్



Next Story

Most Viewed