దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించడంలేదు

by  |
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించడంలేదు
X

దిశ, నల్లగొండ: ‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని’ చందంగా మారింది ఆ రైతుల పరిస్థితి. 65 ఏండ్లుగా భూములను సాగు చేసుకుంటున్నా.. గత ప్రభుత్వాలు పట్టాలిచ్చినా.. వారికి మాత్రం ఆ భూములు అందని ద్రాక్షగానే మారాయి. యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలానికి చెందిన 70 మంది రైతులు తమకు కేటాయించిన భూములకు పట్టాలు అందక.. రెండేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వాలు ఆ భూములకు పట్టాలిచ్చాయి. పట్టాదారు పాసుపుస్తకాలు సైతం రైతులకు అందించారు. కానీ వారికి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంలో అధికారులు రెండేళ్లుగా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా రైతులు సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు.

60 ఏండ్లుగా సాగు..

యాదా-ద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురంలో సర్వే నెంబరు 255లో 160 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. దీన్ని దాదాపు 65 ఏండ్ల క్రితమే 70 మంది రైతులకు ప్రభుత్వం సాగు చేసుకోమని ఇచ్చింది. ఒక్కో రైతుకు రెండెకరాల నుంచి మూడెకరాల వరకు భూములను కేటాయించింది. అందుకు సంబంధించి అప్పట్లోనే అసైన్డ్ సర్టిఫికెట్లనూ ఇచ్చింది. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఆ భూములను రైతులే సాగు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు సర్టిఫికెట్ల స్థానంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాత పట్టాదారు పుస్తకాల స్థానంలో కొత్త పట్టాదారు పుస్తకాలను రాష్ట్ర వ్యాప్తంగా అందజేసింది. కానీ, ఈ అసైన్డ్ భూములకు సంబంధించిన 70 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వలేదు. ఈ విషయంపై రైతులు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా.. ఫలితం లేకుండా పోయింది. వాస్తవానికి ప్రభుత్వం అసైన్డ్ భూములకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఇవ్వాలని చెప్పింది. వేరే ప్రాంతాల్లో రైతులకు కొత్తపట్టాదారు పాసుపుస్తకాలిచ్చారు. కానీ, నారాయణపురంలో మాత్రం ఇవ్వడం లేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, పీఎం కిసాన్ వంటి పథకాల్లో లబ్ధి పొందలేకపోతున్నారు.

భూమిని కాజేసేందుకు కుట్ర!

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం కావడం.. భూముల ధరలకు రెక్కలు రావడంతో ఆ భూమిని కాజేసేందుకు పెద్దలు కుట్ర పన్నతున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఆ రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదన వచ్చినా ఈ భూమిని చూపుతున్నారు. గతంలో ఇక్కడ మార్కెట్ యార్డు నిర్మించాలన్న ప్రతిపాదనలను అధికారులు చేశారు. కానీ, రైతులు అడ్డుపడి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్.. అర్హులైన రైతులకు కొత్తపట్టాదారు పాసుపుస్తకాలివ్వాలని సైతం ఆదేశించారు. కానీ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇదే అదునుగా మరికొంత మంది ఈ భూమిపై సాగులో లేకున్నా.. దొంగ పట్టాలు సృష్టించి భూమిని కాజేసేందుకు కుట్ర పన్నారు. అలాంటి వారిని సాకుగా చూపి అధికారులు మిగిలిన రైతులందరికీ పట్టాలివ్వడం మానేశారు. దీని వెనుక స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్న ఆరోపణలు జోరుగా విన్పిస్తున్నాయి.

పంటబీమా కూడా వస్తలేదు.. -కృష్ణయ్య, రైతు, సంస్థాన్‌ నారాయణపురం

ఏండ్ల తరబడి ఇదే భూమిలో పంటలు సాగు చేసుకుంటున్నాం. మాకు ఎక్కడా భూములు లేవు. ఉన్నదొక్కటి ఇదే. ప్రతి సంవత్సరం పంటలు సాగు చేస్తున్నా.. కాలం కలిసి రాక దిగుబడి తక్కువ వచ్చి నష్టపోతున్నాం. అందుకోసం డీడీ తీసీ బీమాకు దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు మీకు వర్తించదంటూ తిప్పి పంపుతున్నారు. ఎవరో ఒకరిద్దరూ సాగు చేయకున్నా.. పట్టా ఉండి తమ భూమి ఎక్కడ ఉందో తెలియని వారి పేరు చెప్పి మా పొట్ట కొట్టొద్దు. మా పట్టాదారు పుస్తకాలు మాకివ్వాలి.

Next Story

Most Viewed