జంషెడ్‌పూర్‌పై నార్త్‌ఈస్ట్ విజయం

by  |
జంషెడ్‌పూర్‌పై నార్త్‌ఈస్ట్ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21లో భాగంగా ఆదివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. తిలక్‌మైదాన్‌లో జంషెడ్‌పూర్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ క్లబ్ 2-1 తేడాతో విజయం సాధించింది. విజయాలకు దూరమైన నార్త్ఈస్ట్ జట్టు ఈ మ్యాచ్‌తో ఊరట కలిగింది. మ్యాచ్ ఆరంభం నుంచి బంతి ఎక్కువగా జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ నియంత్రణలోనే ఉన్నది. అయితే కచ్చితమైన పాస్‌లు అందించుకుంటూ నార్త్ఈస్ట్ జట్టు దూకుడు పెంచింది. ఈ క్రమంలో 36వ నిమిషంలో అశుతోష్ మెహతా గొల్ చేసి నార్త్ఈస్ట్‌కు 1-0 ఆధిక్యాన్ని తీసుకొని వచ్చాడు. తొలి అర్దభాగంలో మరో గోల్ చేయలేదు. ఇక రెండో అర్దభాగంలో కూడా ఇరు జట్టు గోల్స్ కోసం హొరాహోరీగా తలపడ్డాయి. ఈ క్రమంలో 61వ నిమిషంలో దేశ్రన్ బ్రౌన్ గోల్ చేసి నార్త్ఈస్ట్ ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. అయితే మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుంది అనగా జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ ఆటగాడు పీటర్ హార్ట్లీ 89వ నిమిషంలో గోల్ చేసి నార్త్ఈస్ట్ ఆధిక్యాన్ని 1-2కి తగ్గించాడు. ఆ తర్వాత నిర్ణీత సమయం ముగియడంతో నార్త్ఈస్ట్ జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. ఫెడ్రికో గలేగోకు డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డుతో పాటు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఇక ఆదివారం రాత్రి ఫటోర్డా మైదానంలో గోవా ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. 75వ నిమిషంలో మోహన్ బగాన్ ఆటగాడు ఎడ్యూ గార్షియా, 84వ నిమిషంలో గోవా ఆటగాడు ఇషాన్ పండితా చెరో గోల్ చేశారు. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరుజట్లు 1-1 తేడాతో సమంగా నిలవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు ఎడ్యూ గార్షియా, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సేవియర్ గామాకు లభించింది.


Next Story

Most Viewed