రేవంత్ రెడ్డి పదవికి సీనియర్ల మోకాలడ్డు..?

by  |
రేవంత్ రెడ్డి పదవికి సీనియర్ల మోకాలడ్డు..?
X

దిశ, మేడ్చల్ :
రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో చేరిన అనతికాలంలోనే సొంత చరిష్మాతో రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయినా..అధికార టీఆర్ఎస్ తనను ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసినా.. మొండిగా పోరాడుతున్నారు. టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్.. ఆ పార్టీలో తన పట్టును నిలుపుకునేందుకు మొదట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 2018 అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిప్పటి నుంచి కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు గురించి చర్చ జరుగుతుండగా.. రేవంత్ రాష్ట్రవ్యాప్తంగా పార్టీపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పుకునే కాంగ్రెస్‌లో ఆయన పాచికలు పారడం లేదు. కాంగ్రెస్ సీనియర్ నేతలైన వీహెచ్‌తో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారి నుంచే ఆయనకు సహకారం కొరవడింది. దీంతో ఎన్నో ఆశలతో కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్ రెడ్డికి నిరాశే మిగిలింది.
రాహుల్ దృష్టిలో రేవంత్ రెడ్డి..
2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ప్రజల్లో రేవంత్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను ఆ సభలో స్వయంగా చూసిన రాహుల్..ఆయనను మెచ్చుకున్న సంగతీ తెలిసిందే. దీంతో పార్టీ అధికారంలోకి వచ్చినా, రాకున్నా..టీపీసీసీ పీఠం రేవంత్‌కు దక్కుతుందనే ప్రచారం పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగింది. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు. రేవంత్‌ను వ్యతిరేకించే నేతలంతా రాహుల్ కలిసి సీనియర్లను కాదని జూనియర్‌కు టీపీసీసీ పీఠం అప్పగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని సూచించారని, దీంతో రాహుల్ గాంధీ టీపీసీసీ చీఫ్ మార్పును కొద్దిరోజుల పాటు వాయిదా వేసినట్టు సమాచారం.
మల్కాజిగిరిలో ఎంపీగా గెలిచినా..
అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి పరాజయం పాలైన రేవంత్ రెడ్డి..ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించాడు. ఈ క్రమంలో టీపీసీసీ పీఠాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో పావులు కదిపాడు. అందులో భాగంగానే హుజూర్‌నగర్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్ ప్రకటించిన అభ్యర్థిని కాదని ఏకంగా తానే మరో అభ్యర్థిని ప్రకటించి.. పార్టీ వర్గాల్లో కలకలం రేపాడు. దాంతో రేవంత్ దూకుడును తగ్గించేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అప్పటివరకు శత్రువులుగా ఉన్న ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ ఏకమయ్యారు. ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డిలు కలిసి ఉత్తమ్ భార్య పద్మావతినే అభ్యర్థిగా ప్రకటించారు. చివరకు ఆమె పోటీ చేసి ఓడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తర్వాత రేవంత్.. కేవలం మాల్కాజిగిరి నియోజకవర్గానికే పరిమితమైనట్టు కన్పించారు. కానీ లోలోపల ఢిల్లీ స్థాయిలో టీపీసీసీ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారనేది తెలుస్తోంది.
కలిసిరాని సామాజిక వర్గం..
కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కారణంగా ప్రజల్లో ఆదరణ కరువవుతోందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అయితే రేవంత్‌కు టీపీసీసీ ఇచ్చే అవకాశాలున్నాయన్న నేపథ్యంలో..ఆయన్ను ఇరుకున పెట్టేందుకు సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారనే వాదనలు లేకపోలేదు. ఇటీవల వెలుగులోకి వచ్చిన భూవ్యవహారం అదే కోవలోకి చెందినదని సమాచారం. దీంతో రేవంత్‌కు టీపీసీసీ దక్కడంపై నీలినీడలు కమ్ముకున్నాయనే చెప్పాలి. ఈ సస్పెన్స్‌కు తెర పడాలంటే.. మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

Next Story

Most Viewed