టీమ్ ఇండియా ఫిట్‌గా ఉందా?

by  |
టీమ్ ఇండియా ఫిట్‌గా ఉందా?
X

దిశ, స్పోర్ట్స్ : చారిత్రాత్మక టెస్టు సిరీస్ గెలిచి టీమ్ ఇండియా అందరి ప్రశంసలు అందుకుంటున్నది. మరో 10 రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనున్నది. శ్రీలంకలో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి ఇంగ్లాండ్ జట్టు మంచి దూకుడు మీద ఉన్నది. ఆ జట్టులో కీలక ఆటగాళ్లు శ్రీలంక సిరీస్‌కు విశ్రాంతి తీసుకొని పూర్తి ఫిట్‌గా ఇండియాలో అడుగుపెట్టారు. మరోవైపు టీమ్ ఇండియా ఆటగాళ్లు ఆసీస్ పర్యటనలో టెస్టు గెలిచినా.. గాయాలతో ఇండియా చేరారు. చాలా రోజుల తర్వాత ఇండియాకు చేరుకున్న టీమ్ ఇండియా క్రికెటర్లు బంధువుల, స్నేహితులతో రిలాక్స్ అవుతున్నారు. గాయపడిన వారికి బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రీహాబిలిటేషన్ ఏర్పాటు చేస్తామని బీసీసీఐ చెప్పినా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు టీమ్ ఇండియా టెస్టు జట్టు సభ్యలందరూ బుధవారం (జనవరి 27) చెన్నై చేరుకోనున్నారు. మరి అందులో ఎంత మంది ఫిట్‌గా ఉన్నారు? ఎవరి గాయాలు తగ్గాయి అనే ఆందోళన నెలకొన్నది.

వీరి గాయాలు తగ్గాయా?

ఆస్ట్రేలియాలో గాయపడ్డ మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజార, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా చెన్నై టెస్టు ఆడబోతున్నారు. గబ్బా టెస్టులో జస్ప్రిత్ బుమ్రా పొత్తి కడుపు గాయంతో ఆడలేదు. అతడికి విశ్రాంతిని ఇచ్చారు. ఇక మయాంక్ అగర్వాల్ గాయంతోనే నాలుగో టెస్టు ఆడాడు. అతడు క్రీజులో అసౌకర్యంగా కదలడం కనిపించింది. ఆసీస్ బౌలర్లు వేసిన బాడీ లైన్ బౌలింగ్‌తో పుజార కూడా గాయపడ్డాడు. వీరితో పాటు రవిచంద్రన్ అశ్విన్ కూడా స్వల్ప గాయాలతో బాధపడ్డాడు. వీళ్లందరూ తొలి టెస్టులో కీలకమే. అయితే ఇప్పుడు వీళ్లు ఫిట్‌గా ఉన్నారా లేదా అనేది పెద్ద సమస్య. ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ల పూర్తి ఫిట్‌గా మైదానంలో చురుకుగా కదులుతుంటారు. మ్యాచ్ గెలవాలంటే మంచి క్రికెట్‌తో పాటు ఫిట్‌నెస్ కూడా ముఖ్యమే. ఫిట్‌గా లేకుండా అరకొర ఫిట్‌నెస్‌తో కనుక బరిలోకి దిగితే అసలుకే మోసం వస్తుంది. ఆస్ట్రేలియాలో నవదీప్ సైనీ ఫిట్‌గా లేకున్నా.. బౌలింగ్ చేయగలను అని బరిలోకి దిగి 9 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి మిగతా మ్యాచ్ అంతా డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. దీంతో పూర్తి ఫిట్‌నెస్ ఉన్న ఆటగాళ్లను మాత్రమే తుది జట్టులోకి తీసుకోవాలని టీమ్ ఇండియా యాజమాన్యం భావిస్తున్నది.

ట్రైనింగ్‌లో పరీక్ష?

జనవరి 27న టీమ్ ఇండియా మొత్తం చెన్నై చేరుకోనున్నది. క్వారంటైన్ ముగిసిన వెంటనే అందరికీ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ సమయంలోనే ట్రైనర్లు, కోచింగ్ సిబ్బంది కలసి క్రికెటర్లకు ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి ఫిబ్రవరి నుంచి టీమ్ ఇండియా క్రికెటర్లకు పరుగు పరీక్ష నిర్వహించాల్సి ఉన్నది. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరిగే తొలి టెస్టు ఆడే ఆటగాళ్లందరూ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఉన్నవాళ్లే. అందుకే వారికి ఈ సారి పరుగు పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చింది. కానీ, అనధికారికంగా మాత్రం ట్రైనర్ల పర్యవేక్షణలో పరుగు పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన అలసట కారణంగా ఇండ్లలో రిలాక్స్ అవుతున్న క్రికెటర్లు.. చెన్నైలో కఠిన శిక్షణలో పాల్గొనాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు తమ కీలక ఆటగాళ్లైన జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్‌లను శ్రీలంక పర్యటన నుంచి విశ్రాంతి ఇచ్చింది. ఇండియా పర్యటనలో పూర్తి ఫిట్‌గా ఉండాలనే వారికి విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తున్నది.


Next Story

Most Viewed