దద్దుర్లు కూడా కొవిడ్ లక్షణమేనా?

by  |
దద్దుర్లు కూడా కొవిడ్ లక్షణమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. మొన్నటి వరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన కరోనా మహమ్మారి.. ఇప్పుడు పల్లెల్లోనూ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. కోటికి పైగా జనం కరోనా బారినపడ్డారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కట్టుదిట్టమైన చర్యలు అమలు చేసినా.. కరోనా ఉధ‌ృతి తగ్గడం లేదు. దీనికి ఓ ముఖ్య కారణం.. కరోనా క్యారియర్స్. కరోనా సోకినా గానీ లక్షణాలు లేని వాళ్ల వల్లే.. వైరస్ వ్యాప్తి అధికమవుతుంది. అయితే ఇప్పటివరకు జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలను వైద్యులు కొవిడ్ సింప్టమ్స్‌గా చెబుతున్నారు. దద్దుర్లను (స్కిన్ ర్యాషెస్) కూడా కరోనా లక్షణంగా చెప్పవచ్చని లండన్ కింగ్స్ కాలేజీ, జో గ్లోబల్ లిమిటెడ్‌లలోని పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

దద్దుర్లు కూడా కరోనా లక్షణంగా గుర్తించడానికి కింగ్స్ కాలేజీ పరిశోధకులు యూకే కొవిడ్ సింప్టమ్ యాప్ నుంచి డేటా కలెక్ట్ చేశారు. అందులోని 336,847 యూజర్లపై అధ్యయనం చేశారు. ఆ అధ్యయనంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 8.8 శాతం మందికి చర్మపు దద్దుర్లు(skin rash) లేదా అక్రల్ ర్యాష్ (వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఇలాంటి దద్దుర్లు వస్తాయి) ఉన్నట్లు నివేదించారు. అంతేకాదు, కొవిడ్ 19 సింప్టమ్స్ ఉన్న వాళ్లలో కనీసం 8.2 శాతం మందిలో స్కిన్ ర్యాషెస్ కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరిశోధకులు ఇండిపెండెంట్‌గా మరో సర్వే కూడా చేశారు. 17 శాతం మందికి కొవిడ్ -19 ప్రాథమిక లక్షణంగా దద్దుర్లు వచ్చినట్టు వెల్లడించారు. కరోనావైరస్ ప్రధానంగా శ్వాసకోశ వ్యాధిగా చెప్పినా, ఇది చర్మంతో సహా అనేక అవయవాలను కూడా లక్ష్యంగా చేసుకుంటుందని అతని బృందం తెలిపింది.

ఇటలీ డెర్మటాలిజిస్టులు.. కొవిడ్ పేషేంట్లలో దాదాపు 20 శాతం మంది భిన్నమైన స్కిన్ ర్యాషెస్‌తో బాధపడినట్లు తెలిపారు. అందులో ప్యాచి రెడ్ ర్యాషెస్, హైవ్స్, చికెన్‌పాక్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. థాయ్‌లాండ్ వైద్యులు కూడా డెంగ్యూ వచ్చినప్పుడు ఎలాంటి ర్యాషెస్ వస్తాయో అలాంటివి కొవిడ్ -19 బాధితుల్లో వచ్చినట్లు వెల్లడించారు. ఈ అధ్యయనంతో పాటు గతంలో జరిపిన అధ్యయాల ప్రకారం.. స్కిన్ ర్యాషెస్‌‌ను కొవిడ్-19 సింప్టమ్‌గా చెప్పవచ్చు. చర్మ దద్దుర్లు రాగానే డాక్టర్లను సంప్రదిస్తే.. వీలైనంత త్వరగా కొవిడ్ టెస్టు చేయవచ్చని, దాని వల్ల వైరస్‌ను ప్రాథమిక దశలోనే అంతం చేయొచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

Next Story

Most Viewed