మోడీ టూర్ బీజేపీకి కలిసొస్తుందా ?

by  |
మోడీ టూర్ బీజేపీకి కలిసొస్తుందా ?
X

దిశ, వెబ్‌డెస్క్: మినీ అసెంబ్లీ ఎలక్షన్స్‌ను తలపిస్తున్న గ్రేటర్‌లో బీజేపీ బలం పుంజుకుంటుందా ! అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణలో ఎలాగైన పాగా వేయాలని ఫైట్ చేస్తున్న కాషాయం నేతలు అందులో భాగంగానే అగ్రనేతలను హైదరాబాద్‌‌లో తిప్పుతున్నారని, అందుకే కేంద్రమంత్రుల నుంచి పక్క రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంల రాక పార్టీని బలోపేతం చేసుకోవడంలో భాగమేనని అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే నిన్న హైదరాబాద్‌లో ప్రధాని మోడీ చేపట్టిన వ్యాక్సిన్ టూర్ బీజేపీ కార్యకర్తలకు బూస్ట్‌ ఇవ్వడంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావితం చూపుతుందని అంచనా వేస్తున్నారు.

దుబ్బాక ఉపఎన్నిక విజయం తర్వాత జరగబోతున్న ఈ గ్రేటర్ ఎన్నికల్లో తగినంత ప్రభావం చూపకుంటే రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉందని, అందుకే రాష్ట్ర నేతల నుంచి బీజేపీ హైకమాండ్‌ వరకు ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుందని ప్రచారం జరుగుతోంది. అంతేగాక హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఏం విషయంలోనైనా కేంద్ర పెద్దల సపోర్ట్‌ ఉంటుందనే అంశాన్ని ప్రజల్లో చొప్పించడానికి గల్లీ నుంచి ఢిల్లీ నేతల వరకు తీవ్రంగా కృషి చేస్తున్నారన్న మాట వినపడుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కర్ణాటక ఎంపీ తేజస్వీ యాదవ్‌తో ప్రచారం నిర్వహించడం గ్రేటర్‌లో నివసిస్తున్న ఇతర ప్రాంతాలకు చెందిన వారి ఓటు బ్యాంకును మళ్లించడంకోసమేనన్న వ్యూహాత్మక అంశాలు తెరపైకి వస్తున్నాయి.

ఇదేక్రమంలో సీఎం కేసీఆర్ ఎల్బీస్టేడియంలో తలపెట్టిన భారీ బహిరంగ సభతో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆకర్షితులై మళ్లీ మనకు మైనస్‌ అవుతుందని పసిగట్టిన కాషాయ శ్రేణులు.. అదే టైంలో మోడీ హైదరాబాద్‌ టూర్‌ ఉండేలా ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది. ముందుగా చెప్పిన ప్రకారం శనివారం సాయంత్రానికి ప్రధాని హైదరాబాద్‌ పర్యటన ఖరారు చేసినప్పటికీ.. మళ్లీ మార్పులు చేసి… కరెక్ట్‌గా ప్రజలు సభలకు వెళ్లే టైంలో ఇంట్లో కూర్చోబెట్టి.. దృష్టి మొత్తం బీజేపీ వైపునకు మళ్లేలా చేశారని రాజకీయ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో పర్యటన కావడంతో ఓటర్లు బీజేపీ వైపు స్టెప్‌ తీసుకునే అంశాలు ఉంటాయని ఇది ఖచ్చితంగా కమలం పార్టీ అభ్యర్థులకు అనుకూలిస్తుందని గ్రేటర్ పాలిటిక్స్‌లో గుసగుసలు వినపడుతున్నాయి.

అయితే… ప్రధాని టూర్‌కు సీఎంను వద్దనడం, ఆతర్వాత బహిరంగ సభలో కేసీఆర్ సైతం వ్యూహాత్మంగా మాట్లాడటం… చేసిన పనులు చెప్పి, చేయబోయేవి వివరించడంతో ఖచ్చితంగా తమ పార్టీ అభ్యర్థులకు కలిసి వస్తుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. కాగా ఇక్కడి బీజేపీ నేతల కృషితో ఇప్పటికే సగం విజయం ఖాయం అయ్యిందని ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో.. మేనిఫెస్టోలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామనడం, మరుసటి రోజే హైదరాబాద్‌లో ప్రధాని మోడీ టూర్‌తో పాజిటివ్ మెసేజ్ వెళ్లి బీజేపీకి కలిసి వస్తుందని మరో రకమైన చర్చ పొలిటికల్ సర్కిళ్లలో నడుస్తోంది.

ఇవన్నీ ఒకఎత్తయితే… మున్సిపల్‌ ఎన్నికలకు కూడా ప్రధానిని పిలిచి ప్రచారం చేయించారని టీఆర్ఎస్ కొత్త మెసేజ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తుందన్న కరెక్ట్‌ పాయింట్‌ పట్టిన బీజేపీ.. ప్రధాని పర్యటనను ప్రస్తుతం కీలకాంశమైన వ్యాక్సిన్‌ పరిశీలన వరకే పరిమితం చేయడం శుభపరిణామంగా భావిస్తున్నారు. మరి బీజేపీ వేసుకున్న లెక్కల ప్రకారం ప్రధాని టూర్‌ గ్రేటర్‌లో కలిసివస్తోందా లేదా అన్నది ఓటర్‌ నాడిపైనే ఆధారపడే అంశాలే స్పష్టంగా కనపడుతున్నాయి. అటు, టీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ మాటలతో ప్రచారాన్ని ఉర్రూతలూగిస్తున్న తరుణంలో ప్రధాని టూర్‌ ప్రభావం చూపుతుందా లేదా అన్నది కీలకంగా మారింది.

Next Story