ఇదీ సంగతి:దేశ ఆర్థిక విధానం మారకపోతే ముప్పు తప్పదా?

by Disha edit |
ఇదీ సంగతి:దేశ ఆర్థిక విధానం మారకపోతే ముప్పు తప్పదా?
X



శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాల ఎకానమీ దెబ్బ తిన్న నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2023-2024 ఎలక్షన్ సంవత్సరాలు కానున్నాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పులు రూ.70 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కేంద్రం అప్పు 135 లక్షల కోట్ల రూపాయలు దాటింది. 2024 నాటికి ఈ అప్పులు దేశంలో రూ.135 లక్షల కోట్ల నుంచి 155 లక్షల కోట్లకు పెరిగే పరిస్థితి ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకుల రిటర్న్ ఆఫ్ రూ.10 లక్షల కోట్లు దాటనుంది. అధిక ధరలు, నిరుద్యోగం, అసమానతలు ఇంకా పట్టి పీడించడం జరుగుతుంది. గుజరాత్‌లో నకిలీ, కల్తీ మద్యం తాగి 50 మంది మరణించారు. పెన్సిల్, షార్ప్‌నర్, పెరుగు, పాల మీద జీఎస్‌టీ వేసారు. 'నువ్వు క్షమాపణ చెప్పాలంటే, నువ్వు క్షమాపణ చెప్పాలి' అంటూ అధికార, విపక్షాల లొల్లి కొనసాగుతున్నది.

దేశంలో ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ కుదేలవుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలలలో అంటే ఏప్రిల్, మే, జూన్‌లోనే నాలుగు లక్షల కోట్ల నష్టం జరిగింది. అసలే అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌తో పోల్చినపుడు రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. సహజంగా నష్టం ఏడు శాతం కన్నా ఎక్కువగా ఉండకూడదు. కానీ, 21 శాతం వరకు రావడం ఆందోళన కలిగిస్తున్నది. గత పదేండ్లలో దేశంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ లేదు. నిజానికి సంపాదన రూ.5,68,000 కోట్లు ఉంటే, ఖర్చు రూ.9,47,000 కోట్లు ఉంది. అందుకే నష్టం జరిగింది. జీతాలు, పెన్షన్‌లకే రూ.7,70,000 కోట్లు ఖర్చు అవుతున్నది. గతంలో ఎన్నడూ ఇంత తేడా సంపాదనలోగానీ, ఖర్చులోగానీ లేదు. 'సంపాదన అర్ధ రూపాయి, ఖర్చు రూపాయి' అన్నట్టుగా తయారైంది పరిస్థితి.

విదేశాలలో అమ్ముతున్న ప్రొడక్ట్స్ మన వద్ద అమ్మినపుడు నష్టాలు ఎందుకు? విదేశాలలో లాభాలెందుకు? ఈ అంతు చిక్కని ఆర్థిక నీతిలో ఆంతర్యం ఏమిటో? పాలకులే సమాధానం చెప్పాలి. ఆర్‌బీ‌ఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఇటీవల మాట్లాడుతూ కమ్యూనల్ హార్మోనీ అవసరమని, అప్పుడే దేశం ఆర్థిక పరిస్థితి బాగుంటుందని స్పష్టం చేసారు. 1980లో శ్రీలంకలో తమిళులను వేరు చేసేందుకు జరిగిన ప్రయత్నం లాంటి వాటిని ఆయన ప్రస్తావించారు. శ్రీలంక పరిస్థితికి భారత్ చాలా దూరంలో ఉందన్నారు. విభజన రాజకీయాలు ఒక వర్గం ప్రజలను తీవ్ర అసంతృప్తికి లోను చేస్తాయని, ఇది మంచిది కాదన్నారు. ఎకానమీ గ్రోత్‌కు కమ్యూనల్ హార్మోనీ అనివార్యమన్నారు. నిరుద్యోగం అతి పెద్ద సమస్య అని, దీనిని పరష్కరించాలన్నారు. శ్రీలంక లాంటి దారి చాలా ప్రమాదకరమని అని ఆయన ఒకరకంగా హెచ్చరించినట్లే భావించాలి.

పన్నులు పెరిగి, ఆదాయం తరిగి

గవర్నెస్ లావిష్‌నెస్, రాజరికం దేశాన్ని మరింత కష్టాలలోకి నెడుతున్నది. విదేశీ పెట్టుబడులు తగ్గుతున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణలు పెరుగుతున్నాయి. ఉత్పత్తులు తగ్గి దిగుమతులు పెరిగాయి. ఉపాధి తగ్గినా, పెరగకున్నా ప్రభుత్వ రెవెన్యూలో 80 శాతం జీతాలు, పెన్షన్‌కే పోతున్నాయి. 41 శాతం ప్రజల మీద టాక్స్ భారం పెంచేసారు. కార్పొరేట్‌ల మీద మూడు శాతమే టాక్స్ భారం ఉంది. నాన్ టాక్స్ రెవెన్యూ 70 శాతం తగ్గింది. ఎకానమీని కాపాడలేని పరిస్థితి ఉంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి తక్కువగా అంటే, రూ. 30,330 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి ఇచ్చింది. గతంలో రూ.1,75,000 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు దారుణంగా తగ్గించి ఇచ్చింది. ఇందుకు కారణం కార్పొరేట్‌ల రుణాలు, ప్రభుత్వం వారికి ఇచ్చిన రాయితీలు, రిటర్న్ ఆఫ్‌లు మాత్రమే అంటే అతిశయోక్తి కాదు.

కోర్ సెక్టర్ అయిన బొగ్గు ఉత్పత్తి గ్రోత్ 31 శాతం పెరిగింది. అయినా అదానీలాంటి కార్పొరేట్‌లకు లాభం చేయడానికి నిర్ణయించుకున్నారు. రూ.3,000 ధర ఉన్న టన్ను బొగ్గును రూ.30,000కు ఆయన నుంచి కొనుగోలు చేయించింది ప్రభుత్వం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇందుకు ఒప్పుకోలేదు. కష్టాలలో కూడా సింగరేణి తన వినియోగదారులకు బొగ్గును ఒప్పందం మేరకు సరఫరా చేయడం అభినందనీయం. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్‌కు మంచి గిరాకీ వచ్చిన నేపథ్యంలో దేశంలోని ఇండియన్ ఆయిల్ ఉత్పత్తిని 66 శాతం తగ్గించి వేయడం జరిగింది. గతంలో 541 కోట్ల లాభం పొందిన ఇండియన్ ఆయిల్ ఈసారి ప్రభుత్వ విధానాల వలన రెండు వేల కోట్లు నష్టపోయింది. నేచురల్ గ్యాస్ పరిస్థితి అంతే.

విదేశీ పెట్టుబడులు వెనుకకు

ఉక్రెయిన్-రష్యా యుద్ధం వలన స్టీల్ ఉత్పత్తి పెరిగింది. సిమెంట్ ఉత్పత్తి 19 శాతం పెరిగినప్పటికీ 42 శాతం ప్రాజెక్టుల పనులు ఆగి ఉన్నాయి. కరెంటు ఉత్పత్తి 15 శాతం పెరిగింది. అయితే, ఏక కాలంలో రూ. 60 వేల కోట్ల ఖర్చు పెరిగింది. ఈ ఏడు సంవత్సరాలలో 22 కోట్ల నిరుద్యోగులు తయారయ్యారు. కేంద్రం ఇచ్చిన ఉద్యోగాలు ఏడు లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇటీవల పీఎం నరేంద్ర మోదీ ప్రకటించిన పది లక్షల ఉద్యోగాల నియామకం జరగాల్సిన ఉంది. మన దేశం నుంచి రూ.2.5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు ఉపసంహరించుకోవడం జరిగింది. శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాల ఎకానమీ దెబ్బ తిన్న నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2023-2024 ఎలక్షన్ సంవత్సరాలు కానున్నాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పులు రూ.70 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కేంద్రం అప్పు 135 లక్షల కోట్ల రూపాయలు దాటింది.

2024 నాటికి ఈ అప్పులు దేశంలో రూ.135 లక్షల కోట్ల నుంచి 155 లక్షల కోట్లకు పెరిగే పరిస్థితి ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకుల రిటర్న్ ఆఫ్ రూ.10 లక్షల కోట్లు దాటనుంది. అధిక ధరలు, నిరుద్యోగం, అసమానతలు ఇంకా పట్టి పీడించడం జరుగుతుంది. గుజరాత్‌లో నకిలీ, కల్తీ మద్యం తాగి 50 మంది మరణించారు. పెన్సిల్, షార్ప్‌నర్, పెరుగు, పాల మీద జీఎస్‌టీ వేసారు. 'నువ్వు క్షమాపణ చెప్పాలంటే, నువ్వు క్షమాపణ చెప్పాలి' అంటూ అధికార, విపక్షాల లొల్లి కొనసాగుతున్నది. మహారాష్ట్రలో, బెంగాల్‌లో ఒక విపక్ష నేతను, ఒక మంత్రిని, ఒక ఎంపీని ఈడీ అదుపులోకి తీసుకుంది. అక్కడ మంత్రి తాలూకు మహిళ ఇంటిలో 50 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకుంది. అంతా అయోమయం. అసలు సమస్యలు అన్నీ పక్కకు. నేతల లొల్లి, ఎన్నికలు, ప్రభుత్వం ఏర్పాటు, ఉన్న ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఇదే ఎజెండా. ఇది 75 వ స్వాతంత్ర సంవత్సరం. పరిస్థితులు ఇకనైనా మారుతాయా?

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223



Next Story