యాంటిజెన్ టెస్ట్.. బోగస్ : ఎలన్ మస్క్

by  |
యాంటిజెన్ టెస్ట్.. బోగస్ : ఎలన్ మస్క్
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ముందు యూనిట్ మొత్తం కూడా కరోనా టెస్ట్‌లు చేసుకోవడం తప్పనిసరి. ఇందులో భాగంగానే చిరంజీవి తన ‘ఆచార్య’ సినిమా సెట్‌లో అడుగుపెట్టేముందు కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. రిజల్ట్ పాజిటివ్‌గా రావడం, ఆ తర్వాత మరో రెండు రోజులకు మళ్లీ టెస్ట్ నిర్వహించగా నెగెటివ్ రావడం తెలిసిందే. ఫాల్స్ కిట్ వల్లే తనకు తప్పుడు రిజల్ట్ వచ్చిందని చిరు ప్రకటించడంతో దీనిపై వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. ఒకసారి పరీక్షలో పాజిటివ్ వస్తే, పాజిటివ్ గానే భావించాల్సి వుంటుందని ఆయన అన్నారు. ఆ తర్వాత నెగెటివ్ వచ్చినా, లక్షణాలు ఉన్నా లేకున్నా, క్వారంటైన్‌లో ఉండి స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు అన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. అయితే చిరంజీవి ఒక్కరికే ఇలాంటి ఫలితం రాలేదు. చాలామందికి రాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌ ఫలితాల మీద పలు అనుమానాలున్నాయి. తాజాగా టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కూడా ఈ టెస్ట్‌లు బోగస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కరోనా యాంటిజెన్ ఆక్యురసీపై ఎలన్ మస్క్ సందేహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలను లేవనెత్తిన ఎలన్.. ఈ టెస్ట్‌ల ఆధారంగా ఏదో బోగస్ నడుస్తోందని అభిప్రాయపడ్డారు. ‘ఈ రోజు కొవిడ్ టెస్ట్‌ను నాలుగు సార్లు చేయించాను. రెండు టెస్ట్ ఫలితాలు నెగెటివ్ రాగా, మరో రెండు టెస్ట్ రిజల్ట్స్ పాజిటివ్‌గా వచ్చాయి. సేమ్ మెషిన్, సేమ్ టెస్ట్, సేమ్ నర్స్.. భారీ ఎత్తున బూటకం నడుస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. మరి వీటిలో ఏ ఫలితాన్ని నమ్మాలి? అని ప్రశ్నించారు. లక్షణాలు పెద్దగా ఏమీ లేవని, కాకపోతే టిపికల్ కోల్డ్ మాత్రం ఉందని ఆయన తెలిపారు. అంతేకాదు, పాలిమెరేజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) టెస్ట్‌లు కూడా భిన్నమైన ల్యాబ్స్‌లో చేయించానని, వాటి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నానని ఆయన తెలిపారు. టెస్లా వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ సీఈఓకే ఇలాంటి అనుభవం కలిగితే ఇక సామాన్యుల సంగతేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.

యాంటిజెన్ పరీక్షల్లో కచ్చితత్వం కొరవడుతోందని ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాల్లో తమ అభిప్రాయాన్ని తెలిపారు. దీనిపై స్పందించిన పలువురు వైద్యులు.. వైరస్ రక్తంలో కలిసిన తర్వాత యాంటిజెన్‌ ర్యాపిడ్‌ పరీక్షలు చేస్తే ఫలితం ఉంటుందని వెల్లడించారు. కానీ వైరస్‌ గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్నప్పుడు యాంటిజెన్‌ పరీక్షల వల్ల 50 నుంచి 60 శాతం ఫలితాలే కచ్చితత్వంతో కూడి ఉంటాయి. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో మాత్రమే ఖచ్చితమైన ఫలితాలు తెలుస్తాయని, కానీ ఆలస్యమవుతుందని డాక్టర్లు సూచించారు. ఇక ఊపిరితిత్తుల్లో ఉండే వైరస్‌ను గుర్తించేందుకు సిటీస్కాన్‌ చేయడం ఎంతో ఉత్తమమని వారు తెలిపారు. అందువల్ల ఆలస్యమైనా సరే, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమ మార్గంగా భావించాలి.

Next Story

Most Viewed