రేషన్ డీలర్ల దందా.. నా ‘షాపు’లో సరుకులు కొంటేనే రేషన్ బియ్యం ఇస్తా..

by  |
ration-rice
X

దిశ, షాద్‌నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంతో పాటు నియోజకవర్గపరిధిలోని పలు గ్రామాల్లో రేషన్ డీలర్లు వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాము అమ్మే సరుకులు కొంటేనే రేషన్ బియ్యం ఇస్తామంటున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అందించే ఉచిత బియ్యంతో పాటు తాము ఇచ్చే కిరాణా సరుకులు కచ్చితంగా కొనాల్సిందేనని.. లేదంటే రేషన్ బియ్యం ఇవ్వమంటూ బియ్యానికి, నిత్యావసర సరుకులకు ముడిపెడుతూ వినియోగదారులతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

గురువారం షాద్‌నగర్‌లో రేషన్ బియ్యం కోసం వెళ్లిన ఓ యువకుడిని.. ఓ రేషన్ డీలర్ బియ్యంతో పాటు కచ్చితంగా నిత్యావసర వస్తువులు కొనాలని లేదంటే బియ్యం ఇవ్వమని నిరాకరించాడు. ఈ క్రమంలో ఆ యువకుడు రేషన్ డీలర్‌పై చర్యలు తీసుకోవాలని ఫరూఖ్ నగర్ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాడు. అలాగే రేషన్ బియ్యం కోసం వచ్చిన ఓ మహిళకు బియ్యం ఇవ్వకుండా రేపు, మాపు అని తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు.

ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. తనకు తినడానికి తిండి కూడా లేదని.. ఆకలితో ఎన్ని సార్లు డీలర్ చుట్టూ తిరిగినా.. రేపు రమ్మంటూ తిప్పి పంపిస్తున్నాడని తెలిపింది. అంతే కాకుండా పురుగులు పట్టిన, ముక్కిపోయిన బియ్యం అంటగడుతున్నారని ఏడుస్తూ మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకుంది. నియోజకవర్గంలో పలు రేషన్ దుకాణాల వద్ద ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నా సివిల్ సప్లై అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే వీటికి ప్రధాన కారణమని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed