IPL 2025 : అరంగేట్ర మ్యాచ్‌లోనే 4 వికెట్లు.. ఎవరీ అశ్వని కుమార్

by Harish |

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యువ బౌలర్ అశ్వని కుమార్ సత్తాచాటాడు.

IPL 2025 : అరంగేట్ర మ్యాచ్‌లోనే 4 వికెట్లు.. ఎవరీ అశ్వని కుమార్
X

దిశ, స్పోర్ట్స్ : కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యువ బౌలర్ అశ్వని కుమార్ సత్తాచాటాడు. ఐపీఎల్‌లో అతనికి ఇదే తొలి మ్యాచ్. అరంగేట్ర మ్యాచ్‌లోనే 4 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. రోహిత్ శర్మను ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా చేర్చడంతో అశ్వనికి ముంబై తుది జట్టులో చోటు దక్కింది. వచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు. మూడు ఓవర్లు వేసి 24 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అతను తీసిన వికెట్లు కూడా కేకేఆర్‌లో కీలక బ్యాటర్లవే.అశ్వని వేసిన తొలి ఓవర్‌లో మొదటి బంతికే కోల్‌కతా కెప్టెన్ అజింక్యా రహానెను అవుట్ చేశాడు. ముంబై తరపున తొలి బంతికే వికెట్ తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. మొత్తంగా 10వ బౌలర్. రహానెతోపాటు బిగ్ హిట్టర్స్ రింకు సింగ్‌, రస్సెల్‌, మనీశ్ పాండే‌ను కూడా అశ్వని బోల్తా కొట్టించాడు. అద్భుతమైన ప్రదర్శనతో అశ్వని ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.

కోల్‌కతాపై సంచలన ప్రదర్శనతో అశ్వని కుమార్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాడు. అతని గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. 23 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అశ్వని పంజాబ్‌లోని మొహాలిలో జన్మించాడు. ఐపీఎల్‌కు ముందు అతనికి దేశవాళీలో కూడా పెద్దగా అనుభవం లేదు. 2022లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరపున అరంగేట్రం చేశాడు. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు తీశాడు. రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, నాలుగు లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. షేర్ ఈ పంజాబ్ టీ20 టోర్నీలో అశ్వని సంచలన ప్రదర్శన‌తో వార్తల్లో నిలిచాడు. ఆ టోర్నీలో టాప్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు. అతని ప్రతిభను గుర్తించిన ముంబై వేలంలో అతన్ని కొనుగోలు చేసింది. రూ. 30 లక్షలకు జట్టులోకి తీసుకుంది. గత సీజన్‌లో అతను పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేదు. ఈ సారి ముంబై తనపై నమ్మకం ఉంచి తుది జట్టులోకి తీసుకుంది. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అశ్వని వమ్ముచేయలేదు.

‘చాలా ఆనందంగా ఉంది. మొదట్లో కొంత ఒత్తిడి ఉంది. కానీ, నేను ప్రశాంతంగా ఉండేందుకు జట్టు వాతావరణం సహాయపడింది. అరంగేట్రాన్ని ఆస్వాదించమని, నా బౌలింగ్‌కు కట్టుబడి ఉండమని మా టీమ్ నన్ను ఎంకరేజ్ చేసింది. షార్ట్ బంతులు వేసి బాడీని టార్గెట్ చేయమని పాండ్యా భాయ్ చెప్పాడు. అదే విధంగా బౌలింగ్ చేసి తొలి వికెట్ సాధించాను. మా ఊరులోని ప్రతి ఒక్కరూ నా అరంగేట్రం కోసం ఎదురుచూశారు. ఈ రోజు నాకు అవకాశం దక్కింది. బాగా రాణించాను.’

- అశ్వని కుమార్


Next Story