నాడు సచిన్.. నేడు ధోని: ఐపీఎల్ ఫైనల్లో నాటి సీన్ రిపీట్ కానుందా?

by Dishafeatures2 |
నాడు సచిన్.. నేడు ధోని: ఐపీఎల్ ఫైనల్లో నాటి సీన్ రిపీట్ కానుందా?
X

దిశ, వెబ్ డెస్క్: దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ కు రేపటితో ఫుల్ స్టాప్ పడనుంది. గుజరాత్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం అటు హోం టీమ్ గుజరాత్ టైటాన్స్, ఇటు చెన్నయ్ సూపర్ కింగ్స్ సిద్ధమవుతున్నాయి. ఆడిన తొలి సీజన్ లోనే టైటిల్ ను కొల్లగొట్టిన గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో టైటిల్ పై కన్నేసింది. ఇక ఇప్పటికే నాలుగు టైటిల్స్ గెలిచిన సీఎస్కే ఈసారి కప్ కొట్టి అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న జాబితాలో ముంబై ఇండియన్స్ సరసన నిలిచేందుకు సిద్ధమైంది. అయితే రేపటి ఫైనల్ మ్యాచ్ పై ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. రేపటి మ్యాచ్ లో 2011 వరల్డ్ కప్ సీన్ రిపీట్ కాబోతోందని చెన్నై ఫ్యాన్స్ చెబుతున్నారు.

2011 క్రికెట్ వరల్డ్ కప్ ను భారత్ గెలిచుకున్న విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కెప్టెన్ ధోని సిక్స్ కొట్టి ఇండియాను గెలిపించాడు. ఇక ఎన్నో ఏళ్లపాటు భారత క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన సచిన్ టెండూల్కర్.. తన కెరీర్ లో ఏనాడు వరల్డ్ కప్ గెలవని లోటును ఈ టోర్నీలో కప్ గెలిచిన ధోని సేన తీర్చింది. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్ ను తమ భుజాలపై ఎత్తుకొని గ్రౌండ్ మొత్తం తిప్పారు. భారత క్రికెట్ కు ప్రస్తుతమున్న క్రేజ్ కు మూల కారకుడైన సచిన్ కు ఇండియన్ ప్లేయర్స్ ఆ విధంగా ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం కొన్ని మ్యాచులు ఆడిన సచిన్ క్రికెట్ కు శాశ్వతంగా రిటైర్ మెంట్ ప్రకటించారు. ఇక రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ లో కూడా 2011 సీన్ రిపీట్ కానుందని ధోని అభిమానులు గట్టిగా చెబుతున్నారు.

2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి చెన్నయ్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోని.. ఆడిన 14 సార్లు 10 సార్లు సీఎస్కేను ఫైనల్ కి చేర్చాడు. అందులో 4 సార్లు చెన్నయ్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ సీజన్ తర్వాత ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ కానున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ధోనికి ఘనమైన వీడ్కోలు ఇచ్చేందుకు సీఎస్కే ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని చెన్నై ఫ్యాన్స్ చెబుతున్నారు. 2011లో సచిన్ ను ఎలాగైతే భుజాలపై ఎత్తుకొని గ్రౌండ్ మొత్తం తిప్పారో రేపు గుజరాత్ ను చిత్తు చేసి ధోనికి అలాంటి ట్రీట్ ఇవ్వడానికి సీఎస్కే ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని ధోని అభిమానులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. ఇక ధోని కూడా సీఎస్కేకు ఇంకో టైటిల్ అందించాకే రిటైర్ మెంట్ ప్రకటించనున్నారని ప్రచారం జరుగుతోంది. మరి రేపటి మ్యాచ్ లో నిజంగా 2011 సీన్ రిపీట్ అవుతుందా లేక గుజరాత్ మరోసారి కప్పును ఎగరేసుకుపోతుందా తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే.



Next Story

Most Viewed