IPL 2026.. చెన్నై బోణీ కొట్టేనా?

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్‌కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడనున్నాయి.

IPL 2026.. చెన్నై బోణీ కొట్టేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్‌కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చేపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ సీఎస్కె జట్టుకు చావోరేవో అన్నట్లుగా మారింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో చెన్నై ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కేవలం 127 పరుగులకే ఆలౌట్ అయిన చెన్నైపై రాజస్థాన్ సునాయాసంగా గెలిచింది. సొంతగడ్డపై ఆడుతున్న ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి బోణీ కొట్టాలని రుతురాజ్ గైక్వాడ్ సేన పట్టుదలగా ఉంది.

చెన్నై ఆశలన్నీ వీరిపైనే

ఈ సీజన్‌లో రూ.18 కోట్లకు ట్రేడ్ ద్వారా చెన్నైలోకి వచ్చిన సంజు శాంసన్, మొదటి మ్యాచ్‌లో కేవలం 6 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. ఎంఎస్ ధోనీ గాయం కారణంగా అందుబాటులో లేని ప్రస్తుత పరిస్థితుల్లో, సంజు తన బ్యాటింగ్, వికెట్ కీపింగ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి జట్టును ఆదుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. రూ.14.20 కోట్ల భారీ ధరకు అమ్ముడైన ఈ 19 ఏళ్ల యువ ఆటగాడైన కార్తీక్ శర్మ.. రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 18 పరుగులు చేసి కొంత ఆకట్టుకున్నాడు. ధోనీ లేని లోటును భర్తీ చేసే సత్తా ఇతనికి ఉందని మేనేజ్‌మెంట్ గట్టిగా నమ్ముతోంది. గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరమైన డెవాల్డ్ బ్రెవిస్, ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

బలమైన పంజాబ్ కింగ్స్

మరోవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ తన మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి మంచి జోరు మీదుంది. అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చాహల్ వంటి బౌలర్లతో పంజాబ్ బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది. చేపాక్ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి, ఇరు జట్ల స్పిన్నర్లు ఇక్కడ కీలక పాత్ర పోషించనున్నారు. మరి ఈ మ్యాచులో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

Next Story