IPL 2026 : హైదరాబాద్‌తో మ్యాచ్‌.. చేతికి నల్ల బ్యాడ్జీలతో పంజాబ్‌ ఆటగాళ్లు

by Ramesh Naini |

ఉత్తరప్రదేశ్‌లోని మథుర (బృందావనం) వద్ద యమునా నదిలో చోటుచేసుకున్న పడవ ప్రమాద మృతులకు పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు నివాళులర్పించారు.

IPL 2026 : హైదరాబాద్‌తో మ్యాచ్‌.. చేతికి నల్ల బ్యాడ్జీలతో పంజాబ్‌ ఆటగాళ్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని మథుర (బృందావనం) వద్ద యమునా నదిలో చోటుచేసుకున్న పడవ ప్రమాద మృతులకు పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు నివాళులర్పించారు. శనివారం (ఏప్రిల్ 11) తమ సొంత మైదానం న్యూ చండీగఢ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH)తో జరుగుతున్న ఐపీఎల్ 17వ మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండులు (బ్లాక్ బ్యాడ్జీలు) ధరించి బరిలోకి దిగారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా పంజాబ్‌కు చెందిన వారు కావడంతో ఫ్రాంచైజీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘ఈ బాధాకరమైన సమయంలో బాధిత కుటుంబాలకు మేం అండగా నిలుస్తున్నాం’ అని పంజాబ్ కింగ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

ప్రమాదం ఎలా జరిగిందంటే..

కాగా, గురువారం పంజాబ్‌లోని లూథియానా జిల్లా జుగ్రాన్ పట్టణం నుంచి సుమారు 132 మంది యాత్రికులు రెండు బస్సుల్లో బృందావనం చేరుకున్నారు. వీరిలో 25-30 మంది కేశీ ఘాట్ వద్ద యమునా నదిలో విహారయాత్రకు పడవ ఎక్కారు. అయితే, నది మధ్యలో పడవ అదుపుతప్పి అక్కడున్న పాంటూన్ డ్యామ్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా (వీరిలో 9 మంది పంజాబ్, ఒకరు హర్యానా వాసి), మరో ఐదుగురు గల్లంతయ్యారు. దాదాపు 22 మంది యాత్రికులు గాయపడిన విషయం తెలిసిందే.

Next Story