ఆయనో జోకర్.. సంజీవ్ గోయెంకాను బ్యాన్ చేయండి.. లక్నో ఓనర్‍పై లలిత్ మోడీ ఫైర్

by Prasad Jukanti |

రిషబ్ పంత్‌తో ఎల్ఎస్‍జీ ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రవర్తనపై లలిత్ మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆయనో జోకర్.. సంజీవ్ గోయెంకాను బ్యాన్ చేయండి.. లక్నో ఓనర్‍పై లలిత్ మోడీ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 సీజన్‍లో భాగంగా ఓ వైపు గ్రౌండ్ లో సిక్సర్ల మోత మోగుతుంటే మరోవైపు కాంట్రవర్సీలు కాక రేపుతున్నాయి. తాజాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా తీరు పట్ల మరోసారి హాట్ డిస్కషన్ నడుస్తోంది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌తో సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) సీరియస్ అవుతున్నట్లుగా ఉన్న ఆ వీడియోపై ఐపీఎల్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ సంజీవ్ గోయెంకా ఎంఎస్ ధోని, కేఎల్ రాహుల్ పట్ల ఇలాగే వ్యవహరించారని గుర్తు చేసుకుంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ కూడా తీవ్రంగా స్పందించారు.

గోయెంకాను బ్యాన్ చేయండి:

గోయెంకా, పంత్‌ల మధ్య సరిగ్గా ఏం మాట్లాడుకున్నారో స్పష్టంగా తెలియనప్పటికీ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఎక్స్ వేదికగా ఈ అంశంపైస్పందిస్తూ "టోర్నమెంట్ మొదలై ఒకే ఆట అయింది... దీనికి అవసరం లేదు." అని పోస్టు చేశారు. వాన్ పోస్టుపై స్పందించిన లలిత్ మోడీ (Lalit Modi) సంజయ్ గోయెంకాను ఉద్దేశించి.. నేను ముందే చెప్పాను. ఇతను ఓ లూజర్, జోకర్. అతని ప్రవర్తన చూసి నాకు చాలా సిగ్గుగా ఉంది. నేను ఐపీఎల్ ను అభిమానులు, ఆటగాళ్ల కోసం సృష్టించాను. కానీ ప్రతిసంవత్సరం ఇలా జరగడానికి కాదు. నేను ఇంకా ఛైర్మన్ మరియు కమిషనర్‌గా ఉంటే, అతన్ని వెంటనే బ్యాన్ చేసి, అతని టీమ్ యాజమాన్యాన్ని శాశ్వతంగా రద్దు చేసేవాడిని. ఫ్రాంఛైజ్ అగ్రిమెంటులో ఇందుకు ఒక క్లాజ్ కూడా ఉంది.. బీసీసీఐ సమగ్రత కాపాడేలా వ్యవహరించాలి. అతనిపై బీసీసీఐ వెంటనే చర్యలు తీసుకుని ఐపీఎల్ సమగ్రతను కాపాడాలి' అంటూ ట్వీట్ చేశారు.

ఎల్ఎస్ జీ వివరణ:

పంత్ తో సంభాషణ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనిపై ఎల్‌ఎస్‌జి ఒక వివరణ ఇచ్చింది. "మీరు చూసేదంతా నిజం కాదు. కెమెరాలు కట్ చేయనప్పుడు, మ్యాచ్ తర్వాత సహజంగా ఉండే వాతావరణం ఇదిగో అంటూ ఈ సందర్భానికి సంబంధించిన పూర్తి వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో పంత్, గోయెంకా సరదాగా ఉన్నట్లు ఉంది. అయితే గోయెంకా తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన తన జట్టు కోసం డబ్బులు వెచ్చిస్తున్నారని అందువల్ల ఆయన టీమ్ నుంచి మెరుగైన ఆటను కోరుకుంటారని అందులో భాగంగానే ఆయన అలా మాట్లాడి ఉంటారని కొంత మంది మద్దతు పలుకుతుంటే పెట్టుబడి పెట్టినంత మాత్రాన ఆటగాళ్లను ఈ రకంగా అవమానిస్తారా అంటూ మరికొందరు మండిపడుతున్నారు. దీంతో ప్రతి యేడు మాదిరిగా ఈ సారి కూడా గోయెంకా కాంట్రవర్సీగా మారడంతో ఈ సారి ఈ వ్యవహారం ఏ తీరం చేరుతుందో చూడాలి.

Next Story