‘హమ్మయ్యా.. రింగ్‌ దొరికింది!’ ఐపీఎల్ మ్యాచ్‌లో ప్రియురాలికి ప్రపోజ్ చేస్తూ ఉంగరం జారవిడిచిన ఫ్యాన్

by Ramesh Naini |   (  Updated:2026-03-30 11:20:58  IST  )

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సరదా ఘటన చోటుచేసుకుంది.

‘హమ్మయ్యా.. రింగ్‌ దొరికింది!’ ఐపీఎల్ మ్యాచ్‌లో ప్రియురాలికి ప్రపోజ్ చేస్తూ ఉంగరం జారవిడిచిన ఫ్యాన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం (మార్చి 29, 2026) ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సరదా ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో, ఓ అభిమాని తన ప్రియురాలికి ప్రపోజ్ చేయబోయి ఉంగరం కిందపడేయడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. చివరికి స్థానిక ప్రేక్షకుల సాయంతో ఆ ఉంగరం దొరకడంతో కథ సుఖాంతమైంది. అసలేం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌కు హాజరైన ఓ ప్రేమజంట.. చెరో జట్టుకు మద్దతు తెలుపుతూ స్టేడియంలో సందడి చేశారు. ఆ యువకుడు ముంబయి ఇండియన్స్ (MI) జెర్సీ ధరించగా, యువతి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జెర్సీలో ఉన్నారు. మ్యాచ్ మధ్యలో ఆ యువకుడు మోకాళ్లపై కూర్చుని తన ప్రియురాలికి ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ ఇవ్వాలని భావించాడు. కానీ, ఉత్సాహంలో అనూహ్యంగా చేతిలో ఉన్న రింగ్ జారి కింద పడిపోయింది. దీంతో ఆ రొమాంటిక్ క్షణాలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఉంగరం ఎక్కడ పడిపోయిందో కంటికి కనిపించకపోవడంతో వారు కంగారు పడ్డారు. ఇది గమనించిన చుట్టుపక్కల ఉన్న ప్రేక్షకులు కూడా ఆ ఉంగరం కోసం వెతకడం ప్రారంభించారు.

సుఖాంతమైన ప్రేమకథ..

అదృష్టవశాత్తూ, కొద్ది క్షణాల్లోనే పక్కనే ఉన్న మరో వ్యక్తి ఆ ఉంగరాన్ని గుర్తించి అతనికి అందించాడు. హమ్మయ్యా.. రింగ్‌ దొరికింది అనుకోని ఆ ఫ్యాన్, మళ్లీ మోకాళ్లపై కూర్చుని ఉంగరాన్ని అందిస్తూ తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆ యువతి ఎంతో సంతోషంగా అతడి ప్రపోజల్‌ను అంగీకరించి ఆనందంతో హత్తుకుంది. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు పెద్దపెట్టున అరుస్తూ ఆ జంటకు మద్దతుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్యూట్ అండ్ ఫన్నీ మూమెంట్‌కు సంబంధించిన వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా సరదాగా స్పందిస్తున్నారు. బ్రో నిజమైన రోహిత్ శర్మ ఫ్యాన్.. ఏకంగా రింగ్‌నే మర్చిపోయి కిందపడేశాడు’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ముంబైకి ఒకే రోజు రెండు విజయాలు దక్కాయి (మ్యాచ్ గెలవడం, యువకుడి ప్రేమ గెలవడం)’ అంటూ ఇంకొకరు ప్రశంసించారు.

అదరగొట్టిన ముంబై ఓపెనర్లు

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ పోరులో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మలు కేవలం 71 బంతుల్లోనే 148 పరుగుల భారీ భాగస్వామ్యంతో చెలరేగడంతో ముంబయి 221 పరుగుల కొండంత స్కోరును సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ తడబడింది.

Next Story