ధోనీ ఈజ్ బ్యాక్: నెక్ట్స్‌ మ్యాచ్‌కు అందుబాటులో!

by Gantepaka Srikanth |

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఎట్టకేలకు ఒక శుభవార్త అందింది.

ధోనీ ఈజ్ బ్యాక్: నెక్ట్స్‌ మ్యాచ్‌కు అందుబాటులో!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఎట్టకేలకు ఒక శుభవార్త అందింది. గాయం కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, సీఎస్‌కే దిగ్గజం ఎంఎస్ ధోనీ (MS Dhoni) త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరగబోయే కీలక పోరులో ధోనీ బరిలోకి దిగే అవకాశం ఉంది. సీజన్ ప్రారంభానికి ముందే కాలిపిక్క గాయంతో (Calf Strain) బాధపడుతున్న ధోనీ, గత మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన లేకపోవడంతో ఫినిషింగ్ లోపించి సీఎస్‌కే వరుసగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ చేతుల్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్టుకు ధోనీ రాక కొండంత అండగా మారనుంది.

ప్రాక్టీస్ మొదలు..

ధోనీ ఇప్పటికే నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. భారీ సిక్సర్లతో పాత ధోనీని తలపిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు ధోనీ అందుబాటులో ఉండటం కష్టమేనని తెలుస్తోంది. అయితే, ఏప్రిల్ 14న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగే మ్యాచ్‌లో ఆయన ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మైదానంలోకి దిగే ముందు ధోనీకి ఒక ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించనున్నారు. అందులో పాస్ అయితే నేరుగా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రానున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో జట్టు రాణిస్తున్నా, క్లిష్ట సమయాల్లో ధోనీ ఇచ్చే సలహాలు, వ్యూహాలను జట్టు మిస్ అవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సంజూ శామ్సన్ సీఎస్‌కే తరపున వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ధోనీ తిరిగి వస్తే, ఆయన తన పాత స్టైల్‌లో లోయర్ ఆర్డర్‌లో వచ్చి మ్యాచ్‌లను ఫినిష్ చేస్తారని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 'తలైవా' రాకతో చెన్నై రాత మారుతుందో లేదో చూడాలి.

Next Story