ఇంధన డిమాండ్ కోసం రూ. లక్ష కోట్లు: ఐఓసీ

by  |
ఇంధన డిమాండ్ కోసం రూ. లక్ష కోట్లు: ఐఓసీ
X

దిశ, వెబ్‌డెస్క్: భార‌త ప్రభుత్వరంగ సంస్థ ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ (ఐఓసీ) రాబోయే 4-5 ఏళ్లలో దాదాపు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. భవిష్యత్ ఇంధన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సంస్థ రిఫైనింగ్ సామర్థ్యాన్ని మూడింట ఒక వంతు పెంచేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

కంపెనీ వాటాదారులతో జరిగిన వార్షిక సమావేశంలో ఐఓసీ ఛైర్మన్ శ్రీకాంత్ మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ డిమాండ్ ఇప్పటికే కొవిడ్ ముందు స్థాయిలకు చేరుకుందని, డీజిల్ దీపావళి సమయానికి సాధారణ స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘పలు ఏజెన్సీల అంచనాల ప్రకారం ప్రస్తుతం 25 కోట్ల టన్నుల నుంచి 2040 నాటికి 40-45 కోట్ల టన్నులకు భారత ఇంధన డిమాండ్ పెరగనుంది.

దీనికోసం తగిన సామర్థ్యాన్ని కలిగి ఉండాలని భావిస్తున్నట్టు’ శ్రీకాంత్ తెలిపారు. డిమాండ్‌ను తీర్చేందుకు ఐఓసీ కొత్త ప్రాజెక్టులను రూపొందించనుంది. ప్రస్తుతం సంస్థ ముడిచమురును పెట్రోల్, డీజిల్ ఇంధనాలుగా మార్చే 11 రిఫైనరీలను నిర్వహిస్తోంది. ఇవి మొత్తం 8.12 కోట్ల టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.


Next Story

Most Viewed