23 శాతం పెరిగిన వంట గ్యాస్ వినియోగం

by  |
23 శాతం పెరిగిన వంట గ్యాస్ వినియోగం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల దేశీయంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నప్పటికీ, ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన(పీఎంయూవై) వినియోగదారుల్లో ఎల్‌పీజీ గ్యాస్ వాడకం పెరుగుతోందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) తెలిపింది. ఐఓసీఎల్ వెల్లడించిన వివరాల ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌పీజీ వినియోగం 23.2 శాతం పెరిగిందని, పీఎంయూవై లబ్దిదారులకు మూడు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్‌లను ఇవ్వడం ద్వారానే ఈ స్థాయి పెరుగుదల ఉన్నట్టు పేర్కొంది. మొత్తం ఎల్‌పీజీ(పీఎంయూవై, నాన్-పీఎంయూవై) అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 10.3 శాతం పెరిగింది. మొత్తం ఎల్‌పీజీ వినియోగంలో పెరుగుదల గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలంలో మాత్రమే 7.3 శాతం పెరిగినట్టు ఐఓసీఎల్ గుర్తించింది. కేంద్రం అందరికీ వంట గ్యాస్ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పీఎంయూవై పథకంలో భాగంగా 8 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్‌లను అందించింది. దీనికోసం రూ. 12,800 కోట్లను ఖర్చు చేసింది. గతేడాది కరోనా సంక్షోభంతో ఇబ్బందులను ఎదుర్కొన్న పీఎంయూవై లబ్దిదారులకు ఉచితంగా 3 ఎల్‌పీజీ సిలిండర్లను అందించింది. లాక్‌డౌన్ సమయంలో మొత్తం 8 కోట్ల మందికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాన్ యోజన్ ద్వారా 14 కోట్ల ఎల్‌పీజీ సిలిండర్లను ఉచితంగా కేంద్రం అందజేసింది.



Next Story