అథ్లెట్ల టోక్యో ప్రయాణంపై రాజుకున్న నిప్పు!

by  |
IOA
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్ మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇండియా నుంచి పలు క్రీడా విభాగాల్లో అర్హత సాధించిన 118 మంది అథ్లెట్లు ఈ నెల 17న టోక్యో బయలుదేరనున్నారు. బాక్సింగ్ టీమ్ ప్రస్తుతం ఇటలీలో తుది శిక్షణ తీసుకుంటూ ఉండా.. మిగతా ఆటగాళ్లు ఇక్కడే క్వారంటైన్‌లో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో బాక్సర్ అమిత్ పంగల్ చేసిన ఆరోపణ ఇప్పుడు క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే వాళ్ల సెలెక్షన్ సరిగా జరగలేదని అతడు ఆరోపించాడు. పర్సనల్ కోచ్‌లు, ఫిజియోలను టోక్యో రావడానికి అనుమతించని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ).. ఇతర అథ్లెట్ల కుటుంబ సభ్యులను, బంధువులను మాత్రం టోక్యో వెళ్లే వారి లిస్టులో చేర్చిందని ఆరోపించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో టోక్యో ఒలింపిక్ కమిటీ విదేశీ ప్రేక్షకులను అనుమతించడం లేదు. దీంతో ఇండియా నుంచి ఒలింపిక్స్‌కు వెళ్లాలని భావించిన పలువురిని కోచ్‌లు, సహాయక సిబ్బంది జాబితాలో చేర్చారనేది ఇప్పుడు అతి పెద్ద ఆరోపణ.

అసలేం జరిదింది?

టోక్యో ఒలింపిక్స్‌కు ఇండియా నుంచి 100 మందికి పైగా అథ్లెట్లు పలు క్రీడా విభాగాల్లో అర్హత సాధించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ జపాన్‌లో ఎంట్రీకి పలువురిపై నిషేధం విధించింది. విదేశీ ప్రేక్షకులతో పాటు ఆయా దేశాల ఒలింపిక్ కమిటీ అనుబంధంగా పని చేయని వారిని అనుమతించమని పేర్కొన్నది. దీంతో పలువురు క్రీడాకారులకు సంబంధించిన విదేశీ కోచ్‌లు ఇండియా కోటాలో టోక్యో వెళ్లడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అదే సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులకు కూడా జపాన్ వీసాలు నిరాకరించింది. దీంతో కొంత మంది మ్యాచ్ అఫీషియల్స్, సహాయక సిబ్బంది పేరిట టోక్యో వెళ్లడానికి లాబీయింగ్ చేశారు. ఐవోఏలో తమకు తెలిసిన వారితో రికమెండేషన్స్ చేయించడంతో వారికి టోక్యో వెళ్లే వారి జాబితాలో చోటు దక్కింది. వీరిలో ఎక్కువ మంది పలువురు అథ్లెట్ల బంధువులు ఉండటం గమనార్హం. కాగా, బయటి వారి పేర్లను చేర్చే క్రమంలో కొంత మంది అథ్లెట్‌ల వ్యక్తిగత కోచ్‌ల పేర్లు గల్లంతయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఒలింపిక్ అధికారుల జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలు ఒక్కసారిగా బయటపడ్డాయి.

అమిత్ పంగల కోచ్‌కు దక్కని చోటు..

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం తీసుకొస్తాడని భావిస్తున్న అథ్లెట్లలో బాక్సర్ అమిత్ పంగల్ ముందు వరుసలో ఉన్నాడు. అతని వ్యక్తిగత కోచ్ అనిల్ ధన్‌కర్ పేరు టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే వారి జాబితాలో లేకుండా పోయింది. దీంతో అమిత్ పంగల్ ఐవోఏకు పలు మార్లు విజ్ఞప్తి చేశాడు. తాను టోక్యోలో మంచి ప్రదర్శన చేయాలంటే తన వ్యక్తిగత కోచ్ అవసరం అని వేడుకున్నాడు. అయినా సరే ఐవోఏ అధికారులు అతడి మాటను పెడచెవిన పెట్టారు. ఇప్పటి వరకు ధంన్‌కర్ పేరు జాబితాలో చేర్చలేదు. ఈ విషయాన్ని అమిత్ పంగల్ క్రీడాశాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది.

మరోవైపు బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో అర్హత సాధించిన సాయి ప్రణీత్ వ్యక్తిగత కోచ్ విషయంలో కూడా తప్పు జరిగింది. అతడి కోచ్ అయిన అగుస్ ద్వి సంతోషో (ఇండోనేషియా) పేరు జాబితాలో చేర్చారు. కానీ అతడిని ఇండియా తరపున ఒలింపిక్ క్రీడా గ్రామంలో అనుమతించడానికి ఐవోఏ నిరాకరించింది. వ్యక్తిగత కోచ్ ప్రతీ క్షణం తనతో పాటు ఉండాలని.. కానీ అతడిని కోచ్‌గా కాకుండా మ్యాచ్ అధికారిగా చూపెట్టడంతో ఒలింపిక్ విలేజ్‌లో చోటు దక్కలేదని.. అది తన ప్రదర్శనపై ప్రభావం చూపిస్తుందని సాయి ప్రణీత్ చెబుతున్నాడు.

టోక్యో ఒలింపిక్స్ ఫెన్సింగ్‌లో అర్హత సాధించిన సీఏ భవాని తల్లిని టీమ్ మేనేజర్‌గా జాబితాలో చేర్చారు. మనికా బాత్రా పర్సనల్ కోచ్‌ను కూడా జాబితాలో చేర్చకపోవడంతో ఆమె ఐవోఏని సంప్రదించింది. కాగా, ప్రస్తుతం తుది జాబితా సిద్దం అయ్యిందని.. ఇకపై మార్పులు ఉండబోవని చెప్పడంతో అథ్లెట్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. అమిత్ పంగల్ తన కోచ్‌ను ఎలాగైనా టోక్యో పంపాలని వేడుకుంటున్నాడు.


Next Story