'ఐవోయే కార్యాలయం తెరవడానికి అనుమతి ఇవ్వండి'

by  |
IOA
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌కు మరో 7 వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఢిల్లీలో ఉన్న ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐవోయే) కార్యాలయం తెరవడానికి అనుమతి ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌ను కోరారు. ఈ మేరకు ఐవోయే అధ్యక్షుడు నరీందర్ బాత్రా ముఖ్యమంత్రి కేజ్రివాల్‌కు లేఖరాశారు. గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే క్రీడాకారులందరికీ వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. అంతకు ముందే ఐవోయే పలు క్రీడా సమాఖ్యలను వ్యాక్సిన్ వేయించుకున్న, వేయించుకోని క్రీడాకారుల లిస్టును పంపాలని కోరింది. కరోనా వైరస్ ఉధృతి కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ 19 నుంచి ఢిల్లీలో లాక్‌డౌన్ విధించారు. అత్యవసర సేవలు, ప్రభుత్వ కార్యాలయాలు మినహా ఇతర కార్యాలయాలన్నీ మూసేశారు. ముఖ్యంగా క్రీడా సంబంధింత ఆఫీసులు పని చేయడం లేదు. కాగా, ఒలింపిక్స్ నేపథ్యంలో తమకు చాలా పని ఉన్నదని.. ఢిల్లీలో ఉన్న ఐవోయే కార్యాలయం తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. క్రీడాకారుల డేటాను సమీకరించడం, వీసాల దరఖాస్తు తదితర పనులు ప్రారంభించాల్సి ఉన్నది. ఇండియా నుంచి క్రీడాకారులు, ఇతర అధికారులు కలిపి 240 మంది టోక్యోకు వెళ్లనున్నారు.

Next Story