జాతీయ సదస్సులో ప్రసంగించనున్న ఆత్మకూర్ దళిత బిడ్డ

by  |
Madasi Suresh Madiga
X

దిశ, ఆత్మకూరు: హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలం నాగయ్యపల్లి గ్రామానికి చెందిన మాదాసి సురేష్ మాదిగకు అరుదైన గౌరవం దక్కింది. ఈనెల 23, 24 తేదీల్లో కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగే ‘నేషనల్ దళిత్ ల్యాండ్ రైట్స్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా’ సదస్సుకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో దేశంలోని 30 రాష్ట్రాల దళిత ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సుకు తెలంగాణ నుంచి ఆరుగురికి ఆహ్వానం అందగా, అందులో నాగయ్యపల్లికి చెందిన సామాజిక ఉద్యమకారుడు, దళిత బహుజన ఫ్రంట్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి సురేష్ మాదిగకు అవకాశం దక్కింది. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా దళితులు, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలు, వ్యవసాయం రంగంలో తలెత్తిన సంక్షోభం, రైతు వ్యతిరేక చట్టాలతో జరిగే నష్టాలు తదితర అంశాలపై కీలకంగా చర్చించనున్నారు.

కాగా, మాదాసి సురేష్ కాకతీయ యూనివర్సటీలో ఎంఏ రాజనీతిశాస్త్రంలో పట్టా పొందాడు. గత పదేండ్లుగా సమాజంలో దళితులు, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్నారు. ఆయనకు సమాజంలో పీడిత వర్గాల తరపున ప్రశ్నించే గొంతుకగా మంచి పేరుంది. దీంతో జాతీయ సదస్సుకు సురేష్ మాదిగ ఎంపిక కావడం పట్ల దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, కాకతీయ యూనివర్సటీ రిసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్(కుర్సా) అధ్యక్షుడు తాళ్లపెల్లి నరేష్ గౌడ్, డీబీఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్, ఎమ్మార్పీస్, మాలమహానాడు వరంగల్, హన్మకొండా జిల్లాల నాయకులు సురేష్‌ మాదిగను అభినందించారు. అంతేగాకుండా.. తమ గ్రామానికి చెందిన వ్యక్తికి ఈ అవకాశం దక్కడంపై నాగయ్యపల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed