‘దొంగ’ తెలివి.. షేరింగ్ రూముల్లో స్నేహం.. ఐడీ కార్డులతో మోసం

by  |
CP Sajjanar
X

దిశ, క్రైమ్ బ్యూరో : అద్దె గదుల్లో షేరింగ్ ద్వారా ఉండాలని అపరిచితులను కోరుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. అద్దె గదులలో ఉంటూ రూమ్ మేట్స్ గుర్తింపు కార్డులను చోరీలు చేస్తూ.. దేశ వ్యాప్తంగా రెంటెండ్ వాహనాలు తీసుకుని విక్రయిస్తున్న అంతరాష్ట్ర దొంగను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్ భీమవరానికి చెందిన గుడాటి మహేష్ నూతన్ కుమార్ (27) 2016లో బీటెక్ పూర్తి చేసుకుని హైదరాబాద్ నగరానికి వచ్చాడు. షేరింగ్ యాప్ ద్వారా అద్దె గదులలో చేరిన మహేష్ తన తోటి సహచరుల ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపు కార్డులను చోరీలు చేయడంతో పాటు నగదు, ఇతర విలువైన వస్తువులను దొంగిలించి పరారీ అయ్యేవాడు. ఈ క్రమంలో దొంగిలించిన సహచరుల ఐడీ కార్డులను తనకు తెలిసిన టెక్నాలజీ ఆధారంగా మార్ఫింగ్ (ఎడిట్) చేసి రెంటెండ్ వాహనాలను తీసుకునేవాడు. అనంతరం ఆ వాహనాలకు ఉండే జీపీఎస్ ట్రాకర్‌ను తొలగించి, ఒరిజినల్ నంబర్ ప్లేట్ స్థానంలో డూప్లికేటు నెంబరు అమర్చేవాడు. తక్కువ ధరలకు విక్రయిస్తూ.. తన జల్సాలను తీర్చుకునేవాడు.

Cars

ఇలా జూమ్ కార్స్, డ్రైవ్ జీ, రేవ్, రాయల్ బ్రదర్ తదితర రెంటెండ్ బేసిస్ కంపెనీల నుంచి వాహనాలను అద్దెకు తీసుకున్నాడు. కర్నాటక రాష్ట్రం నుంచి ఇన్నోవా క్రిస్టా, వోక్స్ వాగన్ పోలో, మారుతి బలెనో, హుందాయ్ వెర్నా కార్లతో పాటు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ , తెలంగాణ రాష్ట్రంలో రెండు మారుతి స్విఫ్ట్ కార్లను (సుమారు రూ.70 లక్షలు విలువ చేసే ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కర్నాటకలో 3 కేసులు, తమిళనాడులో 1, మహారాష్ట్రలో 1, కేరళలో 1, పశ్చిమ బెంగాల్ లో 1, ఆంధ్రప్రదేశ్ లో 1, తెలంగాణలో 2 కేసులు నమోదయినట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. గతంలో కర్నాటక రాష్ట్రంలో 1, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1, తెలంగాణ (హైదరాబాద్) రాష్ట్రంలో 3 కేసులలో పలుమార్లు జైలుకెళ్లినట్టు గుర్తించారు.

అపరిచితులను ఎప్పుడూ కూడా తమ గదులలో ఉండడానికి అనుమతించవద్దని, వ్యక్తిగత ఐడీ కార్డులు, ఇతర విలువైన వస్తువులను లాకర్లలో భద్రపర్చుకోవాలని సీపీ సజ్జనార్ ప్రజలకు సూచించారు. సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరు, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed