‘గులాబీ’లో ఆధిపత్య పోరు.. అంతర్యుద్ధం మొదలైందా..?

by  |
‘గులాబీ’లో ఆధిపత్య పోరు.. అంతర్యుద్ధం మొదలైందా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : అధికార పార్టీ నేతల్లో అంతర్యుద్ధం మొదలైంది. ప్రస్తుతం కొనసాగుతున్న మండలి ఎన్నికలతో పాటు పార్టీ సభ్యత్వ నమోదులో ఇది స్పష్టమవుతోంది. ఉమ్మడి జిల్లాల పరిధిలోని నేతల మధ్య ఆధిపత్య పోరుతో అటు కిందిస్థాయి నేతలు ఇటు అధికారులు నలుగుతున్నారు. టీఆర్ఎస్ తరపున వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పల్లా రాజేశ్వర్​రెడ్డి, హైదరాబాద్​స్థానానికి వాణీదేవి పోటీ చేస్తున్నారు. వరంగల్ స్థానానికి సంబంధించి గతంలో మంత్రి కేటీఆర్​సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల బాధ్యతను మంత్రులపై పెడుతున్నామని, రోజువారీగా సమీక్షిస్తామన్నారు. హైదరాబాద్​స్థానంలోనూ ముందుగా సూచనలు చేసిన కేటీఆర్ ఆ తర్వాత దూరంగానే ఉంటున్నారు. గతనెల 7న తెలంగాణ భవన్‌లో సీఎం నిర్వహించిన సమావేశం అనంతరం ఓ వర్గం ఢీలా పడినట్టు వ్యవహరిస్తోందని సమాచారం.

మీడియా వేదికగా విమర్శలు

మంత్రి అజయ్, మాజీ మంత్రి తుమ్మల వర్గాలు సోషల్​మీడియా వేదికగా విమర్శలకు దిగాయి. ఖమ్మం బస్టాండ్​సాకుగా లొల్లి మొదలైంది. తుమ్మలకు సీఎం కేసీఆర్ అండ ఉందని, మంత్రి అజయ్‌కు కేటీఆర్​కారణంగానే కేబినెట్‌లో చోటు దక్కిందనే ప్రచారం సాగింది. కేటీఆర్ చెవులు కొరికి మంత్రి పదవి తెచ్చుకున్నారంటూ బాల్కసుమన్ సైతం అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వీటి ప్రచారం ఖమ్మంలో మళ్లీ మొదలైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి మధ్య అంతర్గతంగా విభేదాలొస్తున్నాయి. శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పదవి రాకుండా ప్రశాంత్​రెడ్డి ప్రగతిభవన్ దగ్గర రాజకీయం చేశాడంటూ గతంలోనే బహిరంగంగా ఆరోపణలు వినిపించాయి. ప్రశాంత్‌రెడ్డికి జిల్లా ఎమ్మెల్యేలతో పెద్దగా సఖ్యత లేదనే చర్చ నడుస్తోంది. గత నెల 16న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని లక్కంపల్లి సెజ్‌లో ఓ ప్రైవేట్‌ బయో ప్లాస్టిక్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవంలో జెడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మధ్య వాగ్వాదంతో ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. బాల్కొండ సెగ్మెంట్‌లోనూ ప్రశాంత్​రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేష్​రెడ్డి మధ్య విభేదాలు మొదలయ్యాయి.

మంత్రుల మధ్య వార్

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై ఒక వర్గం కత్తులు నూరుతూనే ఉంది. ఎంపీ జితేందర్‌రెడ్డిని పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పట్టు సాధించేందుకు శ్రీనివాస్‌గౌడ్ ప్రయత్నిస్తుండటం మంత్రి నిరంజన్​రెడ్డి వర్గానికి నచ్చడం లేదు. కొల్లాపూర్​ నియోజకవర్గంలో తనను కాదని ఎమ్మెల్యే హర్షవర్ధన్​రెడ్డికి ఇద్దరు మంత్రులు ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ మంత్రి జూపల్లి వర్గం ఫైర్ అవుతోంది. మరో వైపు లక్ష్మారెడ్డికి సైతం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే జైపాల్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య వర్గ పోరు రోడ్డెక్కింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాప కింద నీరులా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు జిల్లా పరిషత్ చైర్మన్​తీగల అనితా రెడ్డి మహేశ్వరంలో పాగా వేసేందుకు అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నారు. అటు తాండూర్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, జడ్పీ చైర్మన్​సునితారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య వార్​నడుస్తున్నట్లు అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. నల్గొండ జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి, గుత్తా మధ్య విభేదాలున్నాయి. మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వర్గం, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వర్గం మధ్య అంతర్గత పోరు నడుస్తోంది.

కరీంనగర్‌లో మూడు గ్రూపులు

మంత్రి ఈటల రాజేందర్​చేస్తున్న వ్యాఖ్యలు తూటాల్లా పేలుతున్నాయి. మంత్రి గంగుల కమలాకర్ ముందు నుంచీ ఈటలకు సఖ్యత కొరవడింది. మంత్రి గంగులతో పాటు సీనియర్ నేతలను ఉద్దేశించిన ఈటల ఇటీవలే ‘గులాబీ జెండా ఓనర్లం మేమే’ అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈటలను ఓడించేందుకు గంగుల అనుచరులు కొందరు ప్రయత్నించారని పార్టీలో చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్​ ఛైర్మన్ వినోద్​కుమార్​వర్గం తయారైంది. వరంగల్​ఉమ్మడి జిల్లాలోనూ విభేదాలు కొనసాగుతున్నాయి. వినయ్​భాస్కర్‌కు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించినా దానిని ఎర్రబెల్లి దయాకర్ రావు తన్నుకుపోయారు. కడియం శ్రీహరి సైతం ప్రాధాన్యత లేని నేతగా ఉండిపోతున్నారు. ఉద్యమం చేసిందెవ్వరూ… పదవులు అనుభవిస్తున్నదెవ్వరూ… అంటూ వినయ్​వర్గం ఎర్రబెల్లిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి సైతం అప్పుడప్పుడూ జిల్లా రాజకీయాల్లో చేతులేస్తున్నారు. ఇటీవల పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి వ్యవహారంతో సదరు ఎమ్మెల్సీ ఆ స్థానంపై కన్నేసినట్టు చర్చ మొదలైంది.


Next Story

Most Viewed