తీవ్ర ఒత్తిడిలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు

by  |
ruling party MLAs
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణ వచ్చి ఏడేండ్లు గడిచినా.. మాకు డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదు. రెండేళ్ల క్రితం పింఛను దరఖాస్తు పెట్టుకున్న పింఛన్ ఇప్పటికీ రావడం లేదు. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే.. రెండున్నరేళ్లైనా మంజూరు చేయటం లేదు. రూ.లక్ష రుణమాఫీ చేప్పారు.. ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ప్రాజెక్టులు కడుతున్న మా భూములకు పరిహారం రావటం లేదు. మా ఊరు నీళ్లలో మునిగితే పునరావాసం చూపటం లేదు. ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోకపోగా.. స్థానిక సమస్యల పరిష్కారం కాకపోవటంతో ప్రజల నుంచి వినతులు వెల్లువలా వస్తున్నాయి.. అధికార పార్టీ ఎమ్మెల్యేలను, మండల స్థాయి ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో ప్రజలు నిలదీయటంతో ఇప్పుడేం చేద్దామనే అంతర్మథనంలో అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి, ప్రజాప్రతినిధులకు మూడేళ్ల గడువు ఉండగానే.. క్షేత్రస్థాయిలో నిరసనలు, చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు సఫలీకృతం కాలేకపోతున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, కొత్త పింఛన్లు, అమలులో సర్కారు ఇప్పటివరకూ ముందుకు వెళ్లకపోవటంతో క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే వేలాది సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 2019మార్చి నుంచి కొత్త పింఛన్లకు సర్కారు అనుమతి ఇవ్వకపోగా.. 20వేల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 57ఏళ్లు దాటిన వారికి పింఛన్ ఇస్తామని చెప్పి.. ఎన్నికల ఓటరు జాబితా ప్రకారం అర్హులను కూడా గుర్తించారు. సుమారు 60వేల మంది వరకు అర్హులు ఉండగా.. వీరికి రెండేళ్లుగా ఎదురుచూపులే మిగిలాయి. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో చెప్పగా.. రూ.25వేల లోపు వారికే మాఫీ చేయగా.. మిగతా వారికి ఇప్పటివరకూ సర్కారు నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 15వేల మందికి.. రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రజల్లో రోజురోజుకూ అసంతృప్తి పెరుగుతుండటంతో.. అధికార పార్టీ నాయకులకు తలనొప్పిగా మారింది.

ఉమ్మడి జిల్లాలో 6686 డబుల్ ఇండ్లు మంజూరైనా.. 951ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇందులో రెండు గ్రామాల్లో మాత్రమే పూర్తయి గృహ ప్రవేశం చేయగా.. 60 మంది లబ్ధిదారులు మాత్రమే కొత్తింట్లోకి వెళ్లారు. మిగతా గ్రామాల్లో పనులు మధ్యలోనే ఉండగా.. చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో పేదోడి సొంతింటి కల నెరవేరటం కష్టమేనని తెలుస్తోంది. ఇండ్ల నిర్మాణ స్థలంతో పాటు నిర్మాణానికి కూడా డబ్బులు వసూలు చేస్తుండగా.. ఏళ్లు గడిచినా ఇండ్లు ఇవ్వకపోవటంతో లబ్దిదారులో అసహనం పెరుగుతోంది. ఇటీవల కుభీర్ మండలం మాలేగాంలో లబ్దిదారులు ఏకంగా స్థానిక ఎమ్మెల్యే గడ్డిగారి విఠ్ఠల్ రెడ్డిని అడ్డుకుని నిలదీశారు.

స్థానిక సమస్యల పరిష్కారంలోనూ అధికార పార్టీ నేతలకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఉమ్మడి జిల్లాలో సదర్మాట్, గుండెగాం, కాళేశ్వరం పనులు చేస్తున్నా.. రైతులకు పరిహారం, పునరావాసం విషయంలో నిరీక్షణ తప్పటం లేదు. ఇటీవల సదర్మాట్ ముంపు నిర్వాసితులు భూముల పరిహారం కోసం మంత్రి అల్లోలలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. పల్సీకర్ రంగారావు ప్రాజెక్టులో భైంసా మండలం గుండేగాం గ్రామం ప్రతి ఏటా ముంపునకు గురవుతున్నా.. పునరావాసం కల్పించటం లేదు. ప్రతి ఏటా వానాకాలంలో నిరసనలు, ఆందోళనలు చేస్తుండగా.. వారికి సర్కారు నిధులు కేటాయించి పునరావాసం చూపటం లేదు. గతేడాది మార్చి నుంచి కరోనా ప్రభావంతో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. దీంతో నిధులు రాకపోవటంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మింగలేక.. కక్కలేని పరిస్థితి ఉంది. ఏం చేయాలో పాలుపోక అంతర్మథనంలో పడుతున్నారు.


Next Story

Most Viewed