కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు అన్యాయం : నరేందర్

by  |
కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు అన్యాయం : నరేందర్
X

దిశ, క్రైమ్ బ్యూరో : కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ పరిధిలో రెండో విడత కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్ల విధానానికి వీసీ కరుణాకర్ రెడ్డి తూట్లు పొడిచి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల రిజర్వ్ మెడికల్ సీట్లను దొడ్డిదారిలో అమ్ముకుంటున్నారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా విమర్శించింది. ఈ సందర్బంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదివారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. 2020-21 అకడమిక్ ఇయర్‌లో మొదటి విడత కౌన్సెలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించిన యూనివర్శిటీ వర్గాలు.. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు.

ఓపెన్ సీట్లను ముందుగా భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం చేసేందుకే ఓపెన్ కేటగిరీ కౌన్సెలింగ్‌కు బదులుగా ముందస్తుగా రిజర్వేషన్ కేటగిరీ వర్గాల విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారని వాపోయారు. నిజానికి ముందుగా ఓపెన్ కేటగిరీ వర్గాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే, మెరిట్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందే వీలుందన్నారు. ఈ విషయంపై యూనివర్శిటీ వీసీ కరుణాకర్ రెడ్డికి ప్రజా సంఘాలు పలు మార్లు విజ్ఞపనాపత్రాలు అందజేసినా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని ద్వజమెత్తారు. మెడికల్ కాలేజీలతో కుమ్మక్కు కావడం కారణంగానే రిజర్వేషన్ సీట్లకు ముందుగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ మెడికల్ సీట్లను బ్లాక్ చేస్తున్నారని వివరించారు.

Next Story

Most Viewed