బాలల దినోత్సవం రోజున విషాదం.. TRS ఫ్లెక్సీ ఎంత పని చేసింది..

by  |
బాలల దినోత్సవం రోజున విషాదం.. TRS ఫ్లెక్సీ ఎంత పని చేసింది..
X

దిశ, నిజాంపేట్ : జాతీయ బాలల దినోత్సవం రోజున నిజాంపేట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక కార్పొరేటర్ పుట్టినరోజుకు ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీలను ఓ మహిళా నేత.. ఆదివారం చిన్నారులతో తొలగిస్తుండగా వారు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.

వివరాల ప్రకారం.. నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప 77వ బ్లాక్‌లో నివాసం ఉంటున్న ఉప్పలయ్య, సైదమ్మల కుమారుడు పక్షుల నవీన్(10వ తరగతి).. ఎలక రవి, లలిత కుమారుడు ఎలక శ్రీకాంత్(8వ తరగతి).. వీరిద్దరూ ఫ్లెక్సీలు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు ఫ్లెక్సీలు ట్రాన్స్‌పార్మర్‌కు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. బాలల దినోత్సవం రోజునే ఈ దుర్ఘటన జరగడం కలకలం రేపింది. అయితే.. 32వ డివిజన్ టీఆర్‌ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు స్వర్ణ కుమారి ఆ ఇద్దరు బాలలకు తాను కట్టించిన ఫ్లెక్సీలు తొలగించమని పురమాయించడం, పెద్దలు ఎవ్వరు లేకుండా చిన్నారుల చేత ప్రమాదకర పనులు చేయించడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా నిలిచింది.

విద్యుత్ షాక్‌కు బాలలు గురికావడం గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించి నిజాంపేట్ రోడ్డులోని హోలిస్టిక్ హాస్పిటల్‌కు బాలలను తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘటన గురించి తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీష్ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న బాలలను పరామర్శించారు. బాలల ఆరోగ్య స్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యుత్ షాక్‌కు గురైన బాలల పరిస్థితి విషమంగా ఉందని 72 గంటలు దాటితే కానీ తాము ఎలాంటి హామీ ఇవ్వలేమని హోలిస్టిక్ వైద్యులు తెలిపారు. బాచుపల్లి పోలీసులు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.


Next Story

Most Viewed