షర్మిల గూటికి ఇందిరా.. ఉత్తమ్ కారణమట..!

by  |
షర్మిల గూటికి ఇందిరా.. ఉత్తమ్ కారణమట..!
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు, తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగానే పార్టీ వీడినట్టు ఇందిరా శోభన్ స్పష్టం చేశారు. పార్టీకి తాను ఎంతో సేవ చేసినప్పటికీ సముచిత స్థానం కల్పించలేదన్నారు. పార్టీ రాజీనామా అనంతరం లోటస్‌పాండ్‌లో షర్మిలను కలిసిన ఆమె కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధించారు. ఈ సందర్భంగా ఇందిరా మాట్లాడుతూ.. తెలంగాణలో షర్మిల పార్టీ పెడుతున్నట్టు తనకు ముందుగానే చెప్పారన్నారు. అందుకే ఒక మహిళగా షర్మిలకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగారుస్తోందన్న ఇందిరా.. రాజన్న అమలు చేసిన సంక్షేమ పథకాలతోనే రాష్ట్రం స్వర్ణయుగంలో సాగిందన్నారు. ఇక బీజేపీపై స్పందించిన ఆమె మతం, కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. సర్జికల్ స్ట్రైక్ పేరుతో జనాల్లోకి వెళుతున్నారని చెప్పారు. ఇటువంటి సమయంలో ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ పార్టీ గ్రూపు గొడవలతోనే సరిపెట్టుకుంటుందని విమర్శించారు. అందుకే పార్టీ నుంచి బయటకొచ్చానని.. ఇక మీదట షర్మిలతోనే కొనసాగుతానని చెప్పుకొచ్చారు. రాష్ట్ర పరిస్థితులపై అవగాహన ఉన్న వారు రాజకీయాల్లోకి రావొచ్చని.. ఎవరూ కూడా ఇక్కడే పుట్టిన వారు లేరంటూ ఇందిరా శోభన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.


Next Story

Most Viewed