వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ఇండిగో బంపర్ ఆఫర్

by  |
వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ఇండిగో బంపర్ ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలు టీకా వేసుకునేలా ప్రోత్సహించేందుకు దేశీయ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి విమాన ప్రయాణ టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనికోసం ‘వ్యాక్సిఫేర్’ పేరున ఆఫర్ వివరాలను తెలిపింది. అన్ని రకాల ప్రయాణాలు, టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. 18 ఏళ్లు దాటి వ్యాక్సిన్ తీసుకున్న అందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. టికెట్ బుకింగ్ చేసుకున్న సమయానికి భారత్‌లో ఉంటూ రెండు డోసులు లేదా ఒక డోసు అయినా వేసుకున్న వారు ఈ డిస్కౌంట్ పొందవచ్చు.

టికెట్లపై డిస్కౌంట్‌ను పొందడానికి ప్రయాణికులు తాము టీకా వేసుకున్నట్టు ఋజువు చేసే సర్టిఫికేట్ తీసుకుని విమానాశ్రయం చెక్-ఇన్ కౌంటర్‌తో పాటు బోర్డింగ్ వద్ద సమర్పించాలని ఇండిగో వివరించింది. ధృవీకరణ పత్రాలు లేని వారు ఆరోగ్య సేతు యాప్‌లో వ్యాక్సిన్‌కు సంబంధించిన స్టేటస్‌ను చూపించే వెసులుబాటు ఇస్తున్నట్టు ఇండిగో తెలిపింది. ఈ పథకం బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ‘దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా కేంద్రం పంపిణీ చేసే టీకా విధానానికి తమ వంతుగా సహకారం అందిస్తున్నాం. ప్రజలందరూ టీకా తీసుకునేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని’ ఇండిగో చీఫ్ స్ట్రాటజీ ఎవెన్యూ ఆఫీసర్ సంజయ్ కుమార్ చెప్పారు.

Next Story