పెరిగిన పారిశ్రామికోత్పత్తి.. ఫ్లాట్‌గా ద్రవ్యోల్బణం!

by  |
Industrial Production
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ పారిశ్రామికోత్పత్తి మే నెలలో గణనీయంగా పెరిగింది. తక్కువ బేస్ ఎఫెక్ట్ కారణంగా గతేడాదితో పోలిస్తే ఈసారి 29.3 శాతం వృద్ధి చెందినట్టు ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాల ప్రకారం.. మే నెలలో తయారీ రంగం 34.5 శాతం వృద్ధి నమోదు చేయగా, మైనింగ్ ఉత్పత్తి 23.3 శాతం, విద్యుదుత్పత్తి 7.5 శాతం పెరిగింది. సెకెండ్ వేవ్ కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు కావడంతో గణాంకాలు ఊహించిన దానికంటే తక్కువగానే ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వరుసగా రెండో నెల అధికంగా ద్రవ్యోల్బణం..

ఇక, జూన్ నెలకు సంబంధించి ద్రవ్యోల్బణం సైతం అధికంగానే నమోదైంది. మే నెలలో పోలిస్తే స్వల్పంగా తగ్గినప్పటికీ ఆర్‌బీఐ నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువగానే ఉంది. సమీక్షించిన నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 6.3 శాతం నమోదగా, జూన్‌లో ఇది 6.26 శాతానికి తగ్గిందని కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. ద్రవ్యోల్బణం 2-6 శాతం మధ్య ఉండాలనేది ఆర్‌బీఐ లక్ష్యంగా ఉంది. వినియోగదారు ధరల సూచీ ప్రకారం వరుసగా రెండో నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి మించి నమోదైంది. ఆహార పదార్థాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండటమే దీనికి కారణమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆహార ద్రవ్యోల్బణ 5.01 శాతం నుంచి 5.15 శాతానికి చేరుకుంది. ఇంధనం 12.7 శాతం, గుడ్ల ధరలు 19.4 శాతం, నూనె ధరలు 35 శాతం, పండ్ల ధరలు 12 శాతం వరకు పెరిగాయని గణాంకాలు వెల్లడించాయి.


Next Story

Most Viewed