ఈ ఏడాది ప్యాసింజర్ వాహనాలకు తిరుగులేని డిమాండ్!

by  |
ఈ ఏడాది ప్యాసింజర్ వాహనాలకు తిరుగులేని డిమాండ్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటో పరిశ్రమలో ప్యాసింజర్ వాహనాల విభాగం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 22-25 శాతం వృద్ధిని సాధిస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. గతేడాది కరోనా ప్రభావంతో 2020-21లో 2-4 శాతం ప్రతికూల వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు మెరుగవడం, వినియోగదారుల ప్రవర్తన సాధారణ స్థాయికి చేరుకోవడం, గ్రామీణ ఆదాయం స్థిరంగా కొనసాగుతుండటం, పలు ప్రభుత్వ చర్యలు ఆటో పరిశ్రమకు కలిసొస్తాయని, ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాల వృద్ధికి దోహదపడుతుందని ఇక్రా పేర్కొంది.

ప్రధానంగా కరోనా మహమ్మారి కారణంగా చాలామందిలో ప్రజా రవాణా నుంచి వ్యక్తిగత వాహనాల కొనుగోలు పట్ల ఆసక్తి పెరిగిందని, ఇది ఈ రంగం వృద్ధికి సహాయపడుతుందని ఇక్రా తెలిపింది. ముఖ్యంగా ప్యాసింజర్ విభాగంలో యుటిలిటీ వాహనాల విభాగం భారీగా వృద్ధి సాధించే అవకాశం ఉందని, ఇది మిగిలిన విభాగాల కంటే అధికంగా విక్రయాలను సాధించవచ్చని ఇక్రా భావిస్తోంది. మిడ్-సైజ్, ఎగ్జిక్యూటివ్ సెడాన్ విభాగం వాహనాలు తగ్గిపోవచ్చు. ఎంట్రీ లెవెల్ వాహనాలకు కూడా డిమాండ్ తగ్గే అవకాశాలున్నాయని ఇక్రా అభిప్రాయపడింది. ఇక, గత రెండేళ్లుగా క్షీణిస్తున్న లగ్జరీ కార్ల విభాగం 2021 కేలండర్ ఏడాదిలో 25-30 శాతం వృద్ధిని సాధిస్తుందని ఇక్రా వెల్లడించింది.



Next Story

Most Viewed