కరోనా ఎఫెక్ట్.. భారీగా తగ్గిన ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు..!

by  |
కరోనా ఎఫెక్ట్.. భారీగా తగ్గిన ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి వల్ల కలిగిన అంతరాయాలతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 39 శాతం తగ్గాయి. గతేడాది మహమారి కారణంగా లాక్‌డౌన్, ఇతర లాజిస్టిక్, సరఫరా సమస్యలు వాహనాల ఎగుమతులపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని, ముఖ్యంగా మొదటి ఆరు నెలలు అధిక నష్టం వాటిల్లినట్టు భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్‌) తెలిపింది. రెండో సగంలో పరిస్థితులు మెరుగ్గా మారినప్పటికీ అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన గణాంకాలతో పోలిస్తే తక్కువేనని సియామ్ వెల్లడించింది. అదే సమయంలో తీవ్ర పరిస్థితులు ఉన్నప్పటికీ ఉత్తమ గణాంకాలే నమోదయ్యాయని భావిస్తున్నట్టు సియామ్ అభిప్రాయపడింది. సియామ్ గణాంకాల ప్రకారం.. 2020-21లో మొత్తం ప్యాసింజర్ వాహనాల(పీవీ) ఎగుమతులు 38.92 శాతం 4,04,400కి చేరుకున్నాయి.

2019-20లో ఇది 6,62,118గా నమోదయ్యాయి. అలాగే, ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 44.32 శాతం తగ్గి రూ. 2,64,927 యూనిట్లుగా నమోదయ్యాయి. యుటిలిటీ వాహనాల ఎగుమతులు 24.88 శాతం క్షీణించాయి. వ్యాన్ల ఎగుమతులు 42.16 శాతం పడిపోయి 1,648 యూనిట్లకు చేరుకున్నాయి. ప్రధాన ప్యాసింజర్ వాహనాల ఎగుమతిదారులు గత ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన ఎగుమతుల క్షీణతను చూశారు. దేశీయ ప్రధాన ప్యాసింజర్ వాహనాల ఎగుమతిదారు హ్యూండాయ్ మోటార్ ఇండియా 38.57 శాతం తగ్గి రూ. 1,04,342 యూనిట్లను ఎగుమతి చేసింది. మరో దిగ్గజం మారుతీ సుజుకి ఇండియా 94,938 యూనిట్లతో 5.34 శాతం క్షీణతను చూసింది. ఫోర్డ్ ఇండియా 46,064 యూనిట్లతో 64.96 శాతం ఎగుమతులు తగ్గాయి. కియా మాత్రం 40,440 యూనిట్లతో 88.43 శాతం వృద్ధి చూడగా, హోండా ఎగుమతులు 37.54 శాతం పెరిగినట్టు సియామ్ వెల్లడించింది.


Next Story