మూడు నెలల గరిష్ఠానికి చేరిన తయారీ రంగ పీఎంఐ

by  |
మూడు నెలల గరిష్ఠానికి చేరిన తయారీ రంగ పీఎంఐ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ తయారీ రంగం మూడు నెలల అనంతరం సానుకూల వృద్ధి రేటును నమోదు చేసింది. కొత్త ఆర్డర్లు, ఎగుమతులు, కొనుగోళ్ల పరిమాణం, ఇన్‌పుట్ స్టాక్స్ అన్నీ సాధారణ స్థాయికి తిరిగి రావడంతో భారత తయారీ కార్యకలాపాలు జూలైలో భారీ పతనం నుంచి కోలుకున్నాయి. సమీక్షించిన నెలలో తయారీ రంగ పీఎంఐ 55.3 పాయింట్లుగా నమోదైనట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ తన నివేదికలో వెల్లడించింది. కొవిడ్ సెకెండ్ వేవ్ సంక్షోభం నుంచి దేశీయ తయారీ రంగం మొదటిసారిగా అత్యధిక వృద్ధి రేటును సాధించింది. డిమాండ్ పెరగడమే కాకుండా దేశీయంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షలను సడలింపు ఇవ్వడం లాంటి పరిణామాలతో వృద్ధికి సానుకూలత ఏర్పడినట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ తన నివేదికలో వివరించింది. జూన్‌లో పీఎంఐ రేటు 2020, జులై తర్వాత తొలిసారిగా 50 మార్కు కంటే దిగువకు పడిపోయింది.

పీఎంఐ సూచీ 50 కంటే పైన ఉంటే వృద్ధికి సానుకూలంగా పరిగణిస్తారు. 50 కంటే కంటే తక్కువగా నమోదైతే క్షీణ దశలో ఉన్నట్టు. ఈసారి అన్ని విభాగాల్లోనూ సానుకూలతలు ఉండటంతో తయారీ రంగ పీఎంఐ 55.3కి పెరిగింది. తయారీ రంగంలో ఉపాధి స్వల్ప వృద్ధిని నమోదు చేసినట్టు నివేదిక తెలిపింది. పీఎంఐ సర్వే ప్రకారం.. 15 నెలల విరామం తర్వాత తయారీ రంగంలో ఉద్యోగాలు పెరిగినట్లు అభిప్రాయపడింది. అదేవిధంగా ప్రస్తుత ఏడాది పారిశ్రామికోత్పత్తి 9.7 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని ఐహెచ్ఎస్ మార్కిట్ అంచనా వేసింది. ‘జూన్‌లో భారీ పతనం తర్వాత భారత తయారీ పరిశ్రమ కోలుకోవడం ప్రోత్సాహకరంగా ఉంది. ఔట్‌పుట్ గణనీయంగా పెరిగింది. కొత్త వ్యాపారాలు పుంజుకోవడం, అనేక ప్రాంతాల్లో స్థానిక ఆంక్షలను సడలించడం, మూడింట ఒక వంతు కంపెనీలు ఉత్పత్తి నెలవరీగా ఉత్పత్తిని పెంచడం కలిసొచ్చిందని’ ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొల్యానా డి లిమా వెల్లడించారు.



Next Story