రికార్డు స్థాయిలో పెరిగిన మార్చి ఎగుమతులు!

by  |
రికార్డు స్థాయిలో పెరిగిన మార్చి ఎగుమతులు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఎగుమతులు,దిగుమతులు మార్చి నెలలో రికార్డు స్థాయిలో 50 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఎగుమతులు 58.23 శాతం పెరిగి 34 బిలియన్ డాలర్లు(రూ. 2.49 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ఒక నెలలో ఈ స్థాయి ఎగుమతులు నమోదవడం భారత ఎగుమతుల చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. దేశీయ ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకున్న పలు చర్యలు ఈ వృద్ధికి కారణమయ్యాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దిగుమతులు సైతం 52.89 శాతం వృద్ధితో 48.12 బిలియన్ డాలర్లు(రూ. 3.52 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. దీంతో దేశీయ వాణిజ్య లోటు 14.12 బిలియన్ డాలర్ల(రూ. 1.03 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి.

గతేడాది మార్చి ఎగుమతులు, దిగుమతులు కరోనా ప్రభావం కారణంగా ప్రతికూలంగా నమోదైన సంగతి తెలిసిందే. ఆ వ్యత్యాసం కారణంగానే ఈ మార్చిలో వృద్ధి పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. ఈ పరిణామాన్ని ‘బేస్ ఎఫెక్ట్’గా పరిగణిస్తారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గత నెల ఎగుమతుల భారీ వృద్ధికి ఇంజనీరింగ్, ఔషధ, రత్నాలు-ఆభరణాల రంగాల్లో ఎగుమతులు పెరగడం కారణం. అలాగే, బంగారం దిగుమతులు మార్చిలో 7.17 బిలియన్ డాలర్లు(రూ. 52.5 వేల కోట్లు)గా ఉన్నాయి. ఇక, మార్చి 31తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎగుమతులు 7.4 శాతం తగ్గి 290.18 బిలియన్ డాలర్లు(రూ. 21.2 లక్షల కోట్లు)గా నమోదవగా, దిగుమతులు 18 శాతం పడిపోయి 388.92 బిలియన్ డాలర్ల(రూ. 28.5 లక్షల కోట్లు)కు పరిమితమయ్యాయి. 2021, మార్చి నెలకు సంబంధించి చమురు దిగుమతులు 1.22 శాతం పెరిగి 10.17 బిలియన్ డాలర్లు(రూ. 74.5 వేల కోట్లు)కు చేరుకున్నాయి. 2020-2 పూర్తి ఆర్థిక సంవత్సరానికి 37 శాతం క్షీణించి 82.25 బిలియన్ డాలర్లు(రూ. 6.02 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. అదేవిధంగా చమురేతర దిగుమతులు మార్చిలో ఒక్కసారిగా 777.12 శాతం వృద్ధితో 37.95 బిలియన్ డాలర్ల(రూ. 2.78 లక్షల కోట్లు)కు ఎగిశాయి



Next Story

Most Viewed